MMTS లో ఉచిత ప్రయాణంపై రేవంత్ కు షాక్..! రైల్వే బోర్డు షరతు..!
హైదరాబాద్ లో స్థానికంగా రాకపోకలు సాగించే ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై రైల్వే బోర్డు తమ అభిప్రాయం చెప్పేసింది. స్థానికంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వం.. దీని తరహాలోనే ఎంఎంటీఎస్ రైళ్లలోనూ ఉచితంగా రాకపోకలు సాగించేందుకు అనుమతించాలని కోరుతూ ప్రతిపాదన చేసింది. దీనిపై రైల్వే బోర్టు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను, ఇప్పటికే ఉన్న భారీ ఆర్థిక నష్టాలను కారణంగా చూపుతూ జూన్ 2 నుంచి హైదరాబాద్లో మల్టీ-మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (MMTS) రైళ్లలో ఉచిత ప్రయాణం కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను రైల్వే బోర్డు తిరస్కరించింది. రైల్వే అధికారుల ప్రకారం ఎంఎంటీఎస్ నెట్వర్క్ ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక ఒత్తిడితో నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన లేఖలో గత ఏడాదిలోనే ఈ సర్వీసు దాదాపు రూ.160 కోట్ల నష్టాలను చవిచూసిందని రైల్వే బోర్డు పేర్కొంది.

MMTS ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ. 490 కోట్ల బకాయిలను ఇంకా చెల్లించలేదని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తన సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా ఎంఎంటిఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణాన్ని అందించాలని ప్రతిపాదించింది. అయితే, ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల ఆర్థిక నష్టాలు మరింత పెరుగుతాయని వాదిస్తూ రైల్వే అధికారులు ఆ అభ్యర్థనను తిరస్కరించారు. ఉచిత ప్రయాణ పథకం వల్ల తలెత్తే పూర్తి ఆర్థిక భారాన్ని భరిస్తామని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా హామీ ఇస్తేనే ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఆ హామీ ఇచ్చేంత వరకు, ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపేది లేదని వెల్లడించింది. ఎంఎంటిఎస్ కార్యకలాపాల కొనసాగింపు తమకు అత్యంత ప్రాధాన్యత అని, ఆదాయాన్ని ప్రభావితం చేసే ఏ నిర్ణయానికైనా రాష్ట్ర ప్రభుత్వం నుండి తగిన ఆర్థిక మద్దతు ఉండాలని రైల్వే అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications