ఎవరీ శశికళ: జయలలితకు ఎలా దగ్గరయ్యారు?
సినీ, రాజకీయ రంగాల్లోనే కాకుండా సామాజిక రంగంలో కూడా జయలలితను అందరూ దూరంగా పెట్టిన సమయంలో శశికళ దగ్గరయ్యారు. జయలలితకు పరిచయం కాక ముందు శశికళ ఓ వీడియో షాపు నిర్వాహకురాలు. తిండికి కూడా కటకటలాడే స్థితి అంటారు. జయలలితకు సినిమా వీడియోలు తీసుకుని వెళ్లే పనిమనిషి ద్వారా శశికళ పరిచయం ఏర్పడిందని అంటారు. అయితే, మరో ప్రచారం కూడా ఉంది. అప్పటి ఐఎఎస్ అధికారి చంద్రకళ ద్వారా శశికళ జయలలితకు పరిచయమయ్యారని అంటారు. చంద్రకళపై అన్నాడియంకె కార్యకర్తలు యాసిడ్ దాడి కూడా చేశారు. దాంతో ఆమె పదవికి రాజీనామా చేసి జనతా పార్టీలో చేరారని చెబుతారు.
జయలలిత పెంపుడు కుమారుడు సుధాకరన్ వివాహం వైభోగం గురించి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. సుధాకరన్ అక్క కుమారుడైన సుధాకరన్ శివాజీ గణేషన్ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. దాంతో శివాజీ గణేషన్ను పెళ్లికి ఒప్పించడానికి జయలలిత సుధాకరన్ను తాను దత్తత తీసుకున్నట్లు చెప్పి వైభవంగా పెళ్లి చేశారు. 1995లో ఈ పెళ్లి జరిగింది. ఆ తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లో జయలలిత పార్టీ అన్నాడియంకె ఓడిపోయింది. ఆమెపై ఏడు కేసులు కూడా నమోదయ్యాయి. శశికళ రెండు టీవీ చానెళ్లు పెట్టారు. ఓ చానెల్ న్యాయపరమైన చిక్కుల్లో పడింది. ఆ సమయంలో శశికళపై జయలలిత వేటు వేశారు. తనకు పెంపుడు కుమారులెవరూ లేరని కూడా చెప్పారు. ఐదారేళ్ల తర్వాత మళ్లీ దగ్గరకు తీశారు.
అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న శశికళ వ్యవహార శైలి పూర్తిగా మారిందని, ఐఎఎఎస్, ఐపియస్ అధికారులను తన అదుపాజ్ఞల్లోనే ఉంచుకుంటున్నారని జయలలిత దృష్టికి వచ్చిందని అంటున్నారు. అంతేకాకుండా, కేసుల్లో జయలలితకు శిక్ష పడితే తానే ముఖ్యమంత్రిని అవుతానని కూడా చెప్పుకుంటున్నారని సమాచారం. దీంతో తీవ్రంగా మండిపడిన జయలలిత శశికళపైనా, ఆమె కుటుంబ సభ్యులపైనా వేటు వేసినట్లు తెలుస్తోంది.