గాలి ఆర్థిక ఉగ్రవాది, బెయిల్ ఇస్తే అంతే: సిబిఐ వాదన
గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో గాలి, శ్రీనివాస రెడ్డి బెయిలు పిటిషన్లపై విచారణ జరిగింది. "ఓఎంసీ కేసులో చార్జ్షీటు దాఖలు చేశాం. ఇందులో 201 మంది సాక్షులున్నారు. ఈ దశలో కీలక నిందితులైన గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డిలకు బెయిల్ ఇస్తే సాక్షుల్లో చాలామంది ఇబ్బంది పడతారు. ఈ కేసులో అదనపు చార్జ్షీట్ను దాఖలు చేయాల్సి ఉంది. ఈ సమయంలో బెయిలు పిటిషన్ను అనుమతించడం వల్ల కేసు విచారణకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది'' అని పరాశరణ్ తెలిపారు. గాలి నుంచి ముప్పు ఉందంటూ సీబీఐకి లేఖలు రాసిన వారి వివరాలు, లేఖల్లోని సారాంశాన్ని ఆయన కోర్టుకు తెలియచేశారు. వాటిని గాలి తరఫు న్యాయవాది కూడా పరిశీలించారు. ఈ సమయంలో ఓపెన్ కోర్టులో సాక్షుల పేర్లు వెల్లడి కావడంతో సీబీఐ అధికారులు అప్రమత్తమయ్యారు. పేర్లు బయటపడితే సాక్షుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని న్యాయమూర్తి నాగమారుతీ శర్మ దృష్టికి తీసుకొచ్చారు.
కోర్టు విధించే అన్ని షరతులను తన క్లయింట్ పాటిస్తారని, బెయిలు ఇవ్వాలని గాలి తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు కోర్టును కోరారు. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి మూడు రోజుల్లోనే బెయిల్ ఇచ్చారని, రాజగోపాల్కు కూడా బెయిలు మంజూరైందని, వీరికన్నా ముందు అరెస్టు అయిన గాలికి మాత్రం బెయిల్ ఎందుకు నిరాకరిస్తున్నారని అన్నారు. విచారణకు సహకరిస్తామని చెబుతూ బెయిలు ఇవ్వాలని కోరారు. అన్ని విధాలా బెయిలుకు గాలి అర్హుడన్నారు. శ్రీనివాస రెడ్డి బెయిల్ పిటిషన్పై ఆయన న్యాయవాది సురేందర్రావు కూడా ఇదే తరహా వాదనలు విన్పించారు. న్యాయమూర్తి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.