ఎవరికి ఉరేస్తారో తెల్చుకుందాం, రా: హరీష్ రావు
ఉరేసుకోవాల్సి వస్తే చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు ఉరేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో జరిగిన 12 స్థానాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ ట్రస్టు నుంచి చంద్రబాబు రాజకీయం నడిపినప్పుడే ఎర్రబెల్లి దయాకర్ రావు ఉరేసుకోవాల్సి ఉండిందని ఆయన అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా తెలుగుదేశం సీమాంధ్ర నాయకులు పయ్యావుల కేశవ్, కోడెల శివప్రసాద్, దేవినేని ఉమామహేశ్వర రావు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సృష్టించినప్పుడే తెలుగుదేశం తెలంగాణ నాయకులు ఉరేసుకోవాల్సి ఉండిందని ఆయన అన్నారు. శాసనసభలో తెలంగాణ పదాన్నిచంద్రబాబు నిషేధించినప్పుడు మోత్కుపల్లి నర్సింహులు ఏం చేశారని ఆయన అడిగారు.
కేంద్ర హోం మంత్రి ప్రకటన చేసినప్పుడు తెలంగాణను అడ్డుకున్నది చంద్రబాబు నాయుడేనని, రాత్రికి రాత్రి ఎలా ప్రకటన చేస్తారని అడిగారని, తమిళనాడుకు చెందిన చిదంబరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చడానికి కుట్ర చేశారని ఆరోపించారని, ఎన్టీఆర్ ట్రస్టు భవనం నుంచి కృత్రిమ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సృష్టించారని ఆయన అన్నారు. వచ్చిన తెలంగాణ చంద్రబాబు వల్లనే చేజారిందని ఆయన అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య, చిరంజీవిలతో కలిసి కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణపై ఎవరికైనా ఉరి వేయాల్సి వస్తే మొదట చంద్రబాబుకు వేయాలని ఆయన వ్యాఖ్యానించారు.