ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం రావడానికి ముందు రోజు 1947 ఆగస్టు 14న ఏం జరిగింది?
ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్య సంబరాలు ప్రారంభం కావడానికి ముందు రోజు, అంటే 1947 ఆగస్టు 14న దేశ విభజన తెచ్చిన విషాదం కోట్లాది మంది జీవితాలను తలకిందులు చేసింది. ఆగస్టు 14న జరిగిన అత్యంత కీలక పరిణామం అఖండ భారత్ విభజన. బ్రిటీష్ ప్రభుత్వం రూపొందించిన 'భారత స్వాతంత్ర్య చట్టం 1947' ప్రకారం దేశాన్ని భారత్, పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర ప్రతిపత్తి గల దేశాలుగా విభజించారు.
నాటి చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ కరాచీ వెళ్ళి పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్కు అధికార మార్పిడి పత్రాలను అందజేశారు. అక్కడ మహమ్మద్ అలీ జిన్నా మొదటి గవర్నర్ జనరల్గా ప్రమాణ స్వీకారం చేయడంతో, పాకిస్తాన్ ఆగస్టు 14నే తన స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది.

మానవ విపత్తు చోటుచేసుకుంది
అయితే పంజాబ్, బెంగాల్ చరిత్రలోనే అత్యంత దారుణమైన మానవ విపత్తు చోటుచేసుకుంది. రెండు దేశాల మధ్య సరిహద్దులను నిర్ణయించే కీలకమైన 'రాడ్క్లిఫ్ రేఖ' పూర్తయినా, అల్లర్లు పెరుగుతాయనే భయంతో బ్రిటీష్ ప్రభుత్వం దాని వివరాలను ఆగస్టు 17 వరకు రహస్యంగా ఉంచింది. దాంతో తాము ఏ దేశంలో ఉన్నామో తెలియని తీవ్ర గందరగోళంలో రాత్రికి రాత్రే దాదాపు 1.5 కోట్లకు పైగా ప్రజలు శరణార్థులుగా మారారు. చరిత్రలోనే అతిపెద్ద వలసల వల్ల చెలరేగిన మత ఘర్షణల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా, నగరాలన్నీ రక్తసిక్తమయ్యాయి.
దేశమంతా వేడుకల ఉత్సాహంలో ఉంటే గాంధీజీ ఢిల్లీలోని సంబరాలకు దూరంగా ఉన్నారు. బెంగాల్లోని కలకత్తా, నౌఖాలి ప్రాంతాల్లో చెలరేగిన తీవ్ర మత ఘర్షణలను ఆపడానికి, శాంతి స్థాపన కోసం కలకత్తాలోని 'హైదరీ మంజిల్' వద్ద ఆ రోజంతా ఉపవాస దీక్ష, ప్రార్థనలు నిర్వహించారు. సంబరాలు చేసుకోవడం కంటే తోటి మానవుల ప్రాణాలను రక్షించడమే ముఖ్యమని ఆయన భావించారు.
రాత్రి 11.00 గంటలకు సమావేశం
అదే సమయంలో ఢిల్లీలోని రాజ్యాంగ పరిషత్ భవనంలో రాత్రి 11 గంటలకు చారిత్రాత్మక ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. సుచేతా కృపలానీ ఆలపించిన 'వందేమాతరం' గీతంతో సభ ప్రారంభమవగా, రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభ ప్రసంగం చేశారు. అర్ధరాత్రి కాబోయే కొద్ది నిమిషాల ముందు నెహ్రూ తన ప్రసిద్ధ "ట్రిస్ట్ విత్ డెస్టినీ" ప్రసంగాన్ని అందించారు. ప్రపంచం నిద్రిస్తున్న వేళ, భారత్ స్వేచ్ఛాయుత జీవనంలోకి మేల్కొంటోందని ఆయన చెప్పారు. మరొక ప్రధాన సాంప్రదాయ ఘట్టంగా, తమిళనాడులోని తిరువాడుతురై అధీనం మఠానికి చెందిన వేద పండితులు బంగారు 'సెంగోల్' అంటే రాజదండం ను నెహ్రూకు అందజేశారు.
తమిళ సంప్రదాయం ప్రకారం అధికార మార్పిడికి, ధర్మబద్ధమైన పాలనకు గుర్తుగా ఈ రాజదండాన్ని నెహ్రూ స్వీకరించారు. సరిగ్గా అర్ధరాత్రి 12:00 గంటలు కాగానే రాజ్యాంగ భవనం "ఇంకిలాబ్ జిందాబాద్", "భారత్ మాతాకీ జై" నినాదాలతో హోరెత్తింది. హంసా మెహతా భారత రాజ్యాంగ సభకు అధికారికంగా త్రివర్ణ పతాకాన్ని సమర్పించగా, సభ్యులందరూ దేశ సేవకు అంకితమవుతామని ప్రతిజ్ఞ చేయడంతో స్వతంత్ర భారతావని ఆవిర్భవించింది.














Click it and Unblock the Notifications