చేసిందేంలేదు: సామాజిక న్యాయంపై బాలకృష్ణ కామెంట్
అనంతరం ఆయన పామర్రు నుండి కూచిపూడి మీదుగా ఘంటశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. బైక్ ర్యాలీలో భారీగా అభిమానులు, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు. పలువురు ప్రముఖ నేతలు కూడా పాల్గొన్నారు. అన్ని ప్రాంతాల్లో బాలయ్యకు అభిమానులు, తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలుకుతున్నారు. బాలయ్య రాకతో జిల్లా అంతటా కోలాహలం కనిపిస్తోంది. ఆయన ఎక్కడి నుండి పోటీ చేసినా స్వాగతిస్తామని కార్యకర్తలు చెబుతున్నారు. ఆయన రాక అన్ని వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోందంటున్నారు.
కొడాలిలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఆవిష్కరించిన అనంతరం బాలయ్య ఆవేశంగా మాట్లాడారు. ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ, తన తండ్రిని పొగడ్తలతో ముంచెంత్తారు. కొందరు సామాజిక న్యాయం అంటూ వచ్చి ప్రజలకు చేసిందేమీ లేదని, కాని తన తండ్రి మాత్రం పార్టీ స్థాపించిందే సామాజిక న్యాయం కోసమన్నారు. కులమతాలకు అతీతంగా అందరికీ సమ ప్రాధాన్యం ఇచ్చారన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేసిన ఘనత ఎన్టీఆర్ది అన్నారు. టిడిపి పుట్టింది ఓటు బ్యాంక్ కోసం కాదన్నారు. మహిళలకు రిజర్వేషన్, రెండు రూపాయలకు కిలో బియ్యం ప్రవేశ పెట్టింది ఎన్టీఆర్ అన్నారు.
ప్రస్తుత పరిస్థితులు తనను రాజకీయాల్లోకి వచ్చేలా ప్రేరేపిస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపు కోసం కృషి చేస్తానని, టిడిపి ద్వారానే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం చెత్త బియ్యం సేకరించి రూ.1కి ఇస్తోందని విమర్శించారు. ఎన్టీఆర్ టిడిపి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారని తాను అదే బాటలో నడుస్తానన్నారు. రాష్ట్రానికి కాంగ్రెసు నుండి 30 మంది ఎంపీలు ఉన్నా చేసిందేమీ లేదని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు. ఎపిని భారత్లో నెంబర్ 1గా నిలబెట్టాలన్నదే టిడిపి లక్ష్యమన్నారు. తనను సినిమాలో ఆదరించినట్లే రాజకీయాల్లో ఆదరించాలని కోరారు.