చంద్రబాబు తెలంగాణలో లేరు, రాబోరు: కెసిఆర్
చర్చల ద్వారా వ్యూహాన్ని రచించుకుని ముందుకు సాగడమే తప్ప వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ఏ రాజకీయ పార్టీకి కూడా నూకలు చెల్లవని ఢిల్లీకి నివేదికలు వెళ్లాయని, వాళ్లు కూడా మల్లగుల్లాలు పడుతున్నారని, తెలంగాణ వచ్చి తీరుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర సాధన జరిగే వరకు పోరాటం సాగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ సాధన విషయంలో రాజీ పడేది లేదని ఆయన అన్నారు. ఎన్ని కారు కూతలు కూసినా ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు తెలంగాణను అడ్డుకోలేరని ఆయన అన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించాలని, లేకుంటే వారి ఖర్మ వారు అనుభవిస్తారని ఆయన అన్నారు.
కాంట్రాక్టు ముఖ్యమంత్రి, కాంట్రాక్టు మంత్రివర్గం ఉంటే బాగుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఆ వ్యాఖ్య చేశారు. టిఆర్టియు క్యాలెండర్, డైరీలను ఆయన శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. సమైక్యాంధ్రలో తెలంగాణకు న్యాయం జరగదని, స్వరాష్ట్రంలోనే జరుగుతుందని ఆయన అన్నారు. ఆంధ్రావాళ్లకు సింగరేణి బొగ్గు కావాలి గానీ కార్మికుల పిల్లలకు చదవు చెప్పరని ఆయన అన్నారు. ఉన్నత పదవులన్నీ సీమాంధ్ర చేతుల్లోనే ఉంటున్నాయని, అందువల్ల తెలంగాణకు సమైక్యాంధ్రలో న్యాయం జరగదని ఆయన అన్నారు.
ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే వేతనం కూడా ఉపాధ్యాయులకు ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. కాంట్రాక్టు, అప్రెంటిస్ ఉద్యోగాలను తెలంగాణ రాగానే పర్మినెంట్ చేస్తామని ఆయన చెప్పారు. టెట్ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే విద్యాసంస్థలు నడుస్తాయని ఆయన చెప్పారు. తాను ప్రభుత్వ విద్యా సంస్థలోనే చదువుకున్నాని, తాను ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ మాట్లాడగలుగుతున్నానని ఆయన అన్నారు. సింగరేణి పరిధిలోని నాలుగు పాఠశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ అంతా ఒక్కటైందని, ఆనాడు పది మందిమే కావచ్చు గానీ ఈ రోజు మహా సముద్రంగా తెలంగాణ సమాజం తయారైందని ఆయన అన్నారు. ఎవరో ఏదో అంటే న్యూనతకు గురి కావడం సరి కాదని ఆయన అన్నారు. ఏదో ఆంధ్ర పేపరు రాస్తుందని, మన మీద ప్రేమతో కాదని, బాగు ఉరికి మనం అలసిపోవాలని వారు రాస్తున్నారని ఆయన అన్నారు. కెసిఆర్కు తీవ్రమైన జబ్బు ఉందట కదా అని సీమాంధ్ర వ్యక్తి అంటాడని, ఏడాది లోపల కెసిఆర్ చనిపోతే బాగుండునని అనుకుంటున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ చనిపోవాలని సీమాంధ్రవాళ్లు అనుకుంటున్నారని ఆయన అన్నారు. ఉపాధ్యాయులతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయిస్తోందని, ముఖ్యమంత్రిపై కేసు ఎందుకు పెట్టరని ఆయన అన్నారు. 2009 డిసెంబర్ దీక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలమనే నమ్మకం ఏర్పడిందని ఆయన అన్నారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన రాగానే అన్ని వర్గాలు, అన్ని పార్టీలకు చెందిన సీమాంధ్రవాళ్లు ఒక్కటై అడ్డుకున్నారని ఆయన అన్నారు.