చిరంజీవి, బొత్సలకు చెక్: దాసరి వెనుక కిరణ్ రెడ్డి?
ఇటీవల పిసిసి చీఫ్, సిఎం కిరణ్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. బొత్స, చిరంజీవిలు ఇద్దరూ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసినప్పటికీ ఇరువురు కలిసి కట్టుగా కిరణ్కు చెక్ చెప్పాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. కల్తీసారా, బాక్సైట్ ఘటనలపై చిరంజీవి ఫైర్ కాగా, సమయం వచ్చినప్పుడు బొత్స సమావేశాలలో సిఎంను నిలదీసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో చిరంజీవిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు దాసరి స్థానాన్ని కేటాయించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దాసరి లేఖ వెనుక సిఎం ఉండి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే లేఖ రాసిన విషయాన్ని దాసరి మాత్రం కొట్టి పారేశారు. అయితే ఆయన ఈ లేఖ చాలా రోజుల క్రితమే రాశారని, దానికి సోనియా గాంధీ ప్రత్యుత్తరం కూడా రాసినట్లు వార్తలు వస్తున్నాయి.