సిఎం కిరణ్ కుమార్ రెడ్డితో రాజీకి డిఎల్ నో, ఫైటింగే
తాను ఢిల్లీకి సూట్కేసులు మోయలేదని ఆయన అన్నారు. మిగతావాళ్లు మోస్తున్నారనే అర్థం వచ్చేలా ఆయన ఈ మాటలు మాట్లాడారు. పైగా, మంత్రిగా కొనసాగడానికి అంగీకరించినప్పటికీ ఆయన సచివాలయానికి వెళ్లడానికి సిద్ధంగా లేరు. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) కార్యాలయం నుంచే విధులు నిర్వహిస్తానని ఆయన చెప్పారు. దీన్ని బట్టి ఆయన గత మంత్రి పి. శంకర రావు దారిలోనే నడవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పైగా, కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నవారిని కూడగట్టాలనే ఉద్దేశంతో కూడా ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల శానససభల ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆగి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిపై తన సమరాన్ని పెంచాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
పి. శంకరరావు మంత్రిగా కొనసాగుతూనే కిరణ్ కుమార్ రెడ్డిపై సమరం సాగించారు. ముఖ్యమంత్రిపై పలు బహిరంగ విమర్శలు చేశారు. మంత్రి వర్గ సమావేశాలకు కూడా వెళ్లలేదు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కొంత మంది సభ్యులపై నేరుగా సమరానికి దిగారు. అదే పంథాను డిఎల్ రవీంద్రా రెడ్డి అనుసరించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్కు వ్యతిరేకంగా పోరాడుతున్నవారిని కిరణ్ కుమార్ రెడ్డి సహించడం లేదనే అభిప్రాయం బలపడే విధంగా ఆయన వ్యవహరించే అవకాశాలున్నాయి.