భారత భూభాగంలో ఎల్లుండి పాక్ ఎన్నికలు ..! కేంద్రం తీవ్ర అభ్యంతరం..!
భారత (india) భూభాగంలో పాకిస్తాన్ (Pakistan) ఎన్నికల నిర్వహణకు సిద్దమవుతోంది. గతంలో భారత్ నుంచి ఆక్రమించుకున్న ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు పాకిస్తాన్ తాజాగా ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై ఇవాళ కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తక్షణం ఈ భూభాగాలను ఖాళీ చేసి తమకు అప్పగించాలని డిమాండ్ చేసింది. పాకిస్తాన్ చర్యలు, దీనిపై కేంద్రం స్పందన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
పాకిస్తాన్ అక్రమంగా, బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగాల్లో, 'గిల్గిట్-బాల్టిస్తాన్ అసెంబ్లీ' అని పిలవబడే దానికి 2026 జూన్ 7న 'సార్వత్రిక ఎన్నికలు' నిర్వహించాలన్న పాకిస్తాన్ ప్రణాళికలపై తీవ్ర నిరసన తెలుపుతున్నట్లు మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇవాళ ఓ ప్రకటన చేసింది. 1947లో జమ్మూ & కాశ్మీర్ భారతదేశంలో పూర్తిగా, చట్టబద్ధంగా, తిరుగులేని విధంగా విలీనం అయిన ఫలితంగా, 'గిల్గిట్-బాల్టిస్తాన్' అని పిలవబడే ప్రాంతంతో సహా జమ్మూ & కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలన్నీ భారత్ లో అంతర్భాగమని పేర్కొంది. ఇవి తమ దేశం నుంచి విడదీయరానివని స్పష్టంచేసింది.

పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న భూభాగాల్లో నెలకొన్న తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణచివేత, ఆర్థిక దోపిడీ, స్వేచ్ఛ నిరాకరణ వంటి అంతర్లీన సమస్యలను పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు కప్పిపుచ్చలేవని భారత ప్రభుత్వం గుర్తుచేసింది. పాకిస్తాన్ అక్రమ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలలో భౌతిక మార్పులు తీసుకురావడానికి పాకిస్తాన్ చేసే ఏ ప్రయత్నాలనైనా భారత ప్రభుత్వం ఖచ్చితంగా తిరస్కరిస్తుందని హెచ్చరించింది. అలాంటి చర్యలు పాకిస్తాన్ అసలు సమస్యలను దాచలేవని స్పష్టం చేసింది. పాకిస్తాన్ భారత భూభాగాలను చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుని ఉంది, వాటిని ఖాళీ చేయాల్సిందేనని తెలిపింది.













Click it and Unblock the Notifications