ఎర్రకోటపై మార్మోగనున్న వందేమాతరం! 150 ఏళ్ల పండగ వేళ దేశ చరిత్రలో తొలిసారి
భారతావని 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమైన వేళ రక్షణ మంత్రిత్వ శాఖ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసారి ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోట ప్రాకారాలపై ఒక అత్యంత అపూర్వమైన, చారిత్రాత్మక ఘట్టం సాక్షాత్కరించబోతోంది. మన జాతీయ గేయం 'వందేమాతరం' రూపుదిద్దుకుని 150 ఏళ్లు పూర్తవుతున్న శుభతరుణంలో, ఈ పవిత్ర గీతం తొలిసారిగా ఎర్రకోట వేదికపై నుంచి మారుమోగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వేడుకల ప్రాంగణానికి చేరుకోగానే ఈ ఆలాపన ప్రారంభమవుతుంది. అనంతరం ప్రధాని మువ్వన్నెల జెండాను ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈ ఏడాది వేడుకల్లో మరో ఆసక్తికరమైన విశేషం జెన్ జీ ప్రాతినిధ్యం. 2047 నాటికి 'వికసిత భారత్' లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలకపాత్ర పోషించబోతున్న నేటి యువతకు ఈసారి అత్యంత ప్రాధాన్యత కల్పించారు. సైన్స్, మ్యాథ్స్ వంటి అంతర్జాతీయ ఒలింపియాడ్ పోటీల్లో దేశానికి పతకాలు సాధించిన 19 మంది మేధావి విద్యార్థులు నేరుగా ఎర్రకోట ప్రధాన వేదికపై ప్రధాని సమీపంలోనే ఆసీనులవుతారు. అలాగే, ఎర్రకోట ముందు భాగాన ఉండే జ్ఞాన్ పథ్ మార్గంలో 2,500 మంది ఎన్సీసీ అభ్యర్థులు, వైస్ కార్ప్స్ వాలంటీర్లు కలిసి భారీ ఆకారంలో 'వందేమాతరం' అక్షర రూప విన్యాసాన్ని ప్రదర్శించనున్నారు.

వాయుసేన పూలవర్షం.. సంస్కృతుల సమ్మేళనం
వేడుకల వేళ భారత్కు చెందిన 'మి-17' హెలికాప్టర్ వందేమాతరం 150 ఏళ్ల గుర్తుగా ప్రత్యేక బ్యానర్తో నింగిలో విహరిస్తూ, అక్కడ కూర్చున్న అతిథులపై గులాబీ పూల వర్షం కురిపించనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి దాదాపు 5,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. వీరిలో ఇన్నోవేటర్లు, స్టార్టప్ నిర్వాహకులు, చేతివృత్తుల వారు, రైతులు, పారిశుధ్య కార్మికులు ఉన్నారు. దేశ సంస్కృతికి అద్దం పట్టేలా 1500 మంది ఢిల్లీ వాసులు తమతమ రాష్ట్రీయ సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొననుండటం విశేషం.
సరస్సుల పేర్లతో వీఐపీ ఎన్క్లోజర్లు.. సరికొత్త నిర్ణయం!
ఎర్రకోటలో వీఐపీ సంస్కృతికి స్వస్తి పలుకుతూ, నీటి సంరక్షణపై అవగాహన పెంచేలా ఈసారి సీటింగ్ ఎన్క్లోజర్లకు భారతదేశంలోని ప్రముఖ సరస్సుల పేర్లను ఖరారు చేశారు. పర్యాటకుల సౌకర్యార్థం ఉదయం 4 గంటల నుంచే ఢిల్లీ మెట్రో సేవలు ప్రారంభమవుతాయి. ఈ-ఆహ్వాన పత్రికలు ఉన్నవారికి ఉచిత క్యూఆర్ కోడ్ ప్రయాణ సౌకర్యం కల్పించారు. వర్షం పడే అవకాశం ఉన్నందున ఎర్రకోట పరిసరాల్లో డ్రైనేజీ వ్యవస్థను ముందస్తుగా పరిశీలిస్తున్నారు. వేడుక ముగిసిన వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి ప్రత్యేక స్వచ్ఛతా డ్రైవ్ను కూడా సిద్ధం చేశారు.
చట్టపరమైన హోదాతో మరింత గౌరవం
ఇటీవలే పార్లమెంట్ 'జాతీయ గౌరవ నిరోధక (సవరణ) బిల్లు'కు ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా జాతీయ గీతంతో సమానంగా 'వందేమాతరం' గేయానికి కూడా చట్టపరమైన రక్షణ కల్పించారు. దీనిని అవమానించే చర్యలపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు తెచ్చారు. ఈ చట్టసవరణపై లోక్సభలో రాజకీయ ప్రాధాన్యత ఉన్న చర్చ జరిగింది. డీఎంకే వంటి కొన్ని ప్రతిపక్షాలు ఈ బిల్లును విమర్శించగా, భారతీయ జనతా పార్టీ మాత్రం దేశభక్తికి, వందేమాతరానికి సముచిత గౌరవం దక్కేలా చేసేందుకే ఈ చట్టం తోడ్పడుతుందని స్పష్టం చేసింది. అన్ని వివాదాలను పక్కనపెడితే, ఈసారి ఎర్రకోటపై వందేమాతరం మార్మోగే క్షణం ప్రతి భారతీయుడిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపడం ఖాయం.




Click it and Unblock the Notifications