ఆజాద్ బుజ్జగింపులు, రాజీనామాపై తగ్గని డిఎల్ రవీంద్ర
శాఖల తొలగింపు, మార్పులు ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా జరుగుతుందని డిఎల్ రవీంద్రా రెడ్డి చెప్పారు. ఏ శాఖ ఇచ్చినా తనకు సమర్థవంతంగా నిర్వహించే శక్తి ఉందన్నారు. ఈ ప్రభుత్వాన్ని నడిపేది కాంగ్రెసు పార్టీ కాదని, డబ్బులున్న వ్యక్తులని ఆరోపించారు. సిఎం కిరణ్ తానొక్కడినే కాంగ్రెసు పార్టీ అనుకుంటున్నారని మండిపడ్డారు. కాగా మంగళవారం ఉదయమే ఆయన శాఖల కత్తిరింపు మీద ముఖ్యమంత్రిపై తన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న డిఎల్ రాత్రి కడప నుండి హైదరాబాద్ వచ్చారు. రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు కూడా ఆయనను బుజ్జగిస్తున్నట్లుగా సమాచారం.
డిఎల్ రవీంద్రా రెడ్డిని రాజీనామా చేయవద్దని కోరామని కమలాపురం ఎమ్మెల్యే వీర శివా రెడ్డి అన్నారు. గులాం నబీ ఆజాద్, ముఖ్యమంత్రి కిరణ్ను కలిసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. గురువారం కడప జిల్లా నేతలతో సమావేశమవుతామన్నారు.