ఆబ్కారీ మంత్రి మోపిదేవికి చుట్టుకున్న ఎసిబి దాడులు
ముఖ్యమంత్రితో మాట్లాడి ఆయన ఆదేశాల మేరకు నడుచుకుంటానని, రాజీనామాకైనా సిద్ధమని స్పష్టం చేశారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తి చెబితే తన పేరును రిమాండ్ రిపోర్టులో పెట్టడం సరైనదేనా అని ఆయన ప్రశ్నించారు. తన పేరును నివేదికలో ప్రస్తావించిన అధికారి తన వివరణ తీసుకోవాల్సిన బాధ్యతను మరిచారా? అంటూ ఆగ్రహించారు. పూర్తి విచారణ చేయకుండా.. ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా వ్యవహరించారని ఆక్షేపించారు. ఏ సిండికేట్లతోనూ తనకు సంబంధం లేదని, ఇదే విషయాన్ని ఇప్పటికే అనేక సందర్భాల్లో స్పష్టం చేశానని చెప్పారు. సిండికేట్ల నిర్వాహకులతోనూ తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు.
తన క్లాస్మేట్ రాజేంద్ర అని, రిమాండు నివేదికలో ఉన్న బాబ్జీ, రాజాబాబులతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన ప్రస్తావన ఎందుకు వచ్చిందనే అంశంపై ఏసీబీ నుంచి వివరణ తీసుకుంటానని చెప్పారు. సిండికేట్ల నుంచి తనకు ముడుపులు ముట్టాయని తేలితే ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ముక్కు, ముఖం తెలియని వ్యక్తి ఎవరో తనకు డబ్బులు ఇచ్చారంటే ఎలా..? అని ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విచారణ చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరతానని చెప్పారు.