మళ్లీ సిఎంగా యడ్యూరప్ప?ఒత్తిడికి తలొగ్గుతున్న పార్టీ
బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, మరో నేత అరుణ్ జైట్లీ యడ్డీతో సోమవారం మాట్లాడి చల్లబరిచే ప్రయత్నాలు చేశారు. అయితే వారి బుజ్జగింపులకు ఏమాత్రం లొంగని యడ్డీ అధిష్టానానికి నలబై ఎనిమిది గంటల గడువు విధించారు. కొత్త సిఎం ఎన్నిక చేయాలని అందుకు శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని ఆయన షరతు పెట్టారు. బుధవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నందున ఆ లోపే ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆయన చెప్పారని తెలుస్తోంది. అయితే ఆయన ఒత్తిడికి ఎట్టకేలకు బిజెపి తలొగ్గి ఆయనను ముఖ్యమంత్రిగా చేయాలని దాదాపు నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. యడ్యూరప్పపై ఉన్న క్రిమినల్ కేసులు రుజువు కాలేదని బిజెపి నేత అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. సమస్య త్వరలో పరిష్కారమవుతుందని జైట్లీ చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రి సదానంద గౌడ బడ్జెట్ సమావేశాల అనంతరమే ఈ ప్రక్రియ నిర్వహించాలని చెబుతున్నారు. దీంతో ఎప్పుడు తిరిగి యెడ్డీకి పగ్గాలు అప్పగిస్తారో ఇంకా తెలియరాలేదని అంటున్నారు.