కెసిఆర్కు బిజెపి తెలంగాణలో కళ్లెం వేస్తుందా?

మహబూబ్నగర్ ఫలితం ఇచ్చిన ఉత్సాహంతో తెలంగాణ అంతటా ఇదే వైఖరిని తీసుకుని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు కళ్లెం వేస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. తెలంగాణవాదంతో తెలంగాణలో పుంజుకోవడానికి గత కొంత కాలంగా బిజెపి తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. సుష్మా స్వరాజ్ వంటి నేతలను తెలంగాణకు తీసుకుని వచ్చి తెలంగాణ ఇస్తామనే నమ్మకాన్ని కలిగించడానికి రాష్ట్ర నాయకులు ప్రయత్నిస్తున్నారు. మహబూబ్నగర్ ఫలితం తమ కృషికి గుర్తుగా వారు భావిస్తున్నారు. తెరాసతో కొనసాగుతూ వచ్చిన బిజెపి తెలంగాణలో ఇక స్వతంత్రంగా ముందుకు వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు.
తెలంగాణలో సమీప భవిష్యత్తులో పరకాలకు తప్ప మరెక్కడా ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. దీంతో 2014లో వచ్చే ఎన్నికల నాటికి మరింత పుంజుకుంటామని బిజెపి నాయకులు భావిస్తున్నారు. తెరాస తనంత తానుగా తెలంగాణను తేలేదని, దానికి జాతీయ పార్టీల అవసరం ఉంటుందని, రెండు ప్రధాన జాతీయ పార్టీల్లో కాంగ్రెసు తెలంగాణను ఇవ్వడానికి సిద్ధంగా లేదు కాబట్టి తాము మాత్రమే ఇస్తామని చెబుతూ తెలంగాణలో తమ పట్టును బిగించాలని బిజెపి చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇందులో సిహెచ్ విద్యాసాగర రావు వంటి మితవాదులు కూడా ఉన్నారు. వారు తెరాసతోనూ తెలంగాణ జెఎసితోనూ కొనసాగాలనే ఉద్దేశంతో ఉన్నారు. కిషన్ రెడ్డి వంటి నాయకులు మాత్రం స్వతంత్రంగా ముందుకు సాగడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications