లగడపాటి సర్వేపై డికె అరుణ గుర్రు: సీనియర్లపై ఫైర్
పార్టీ సీనియర్ నేతల వైకఱి వల్లనే తమను ప్రజలు విశ్వసించలేదని, తమను నిరాశపరచడం వల్లనే ఉప ఎన్నికల్లో ఓడిపోయామని ఆమె అన్నారు. తమలాంటివారికి మార్గదర్శనం చేయడానికి బదులు విమర్శలు చేయడం మంచిది కాదని ఆమె అన్నారు. అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుని పార్టీని పటిష్టపరచాలని ఆమె సూచించారు. కాంగ్రెసు తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతూ ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. పార్టీ పార్లమెంటు సభ్యులు, సీనియర్లు తెలంగాణ తెచ్చేది ఇచ్చేది తామేనని చెప్పి ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించాల్సి ఉండిందని ఆమె అన్నారు. తెలంగాణ ఎంత ముఖ్యమో పార్టీ కూడా అంతే ముఖ్యమని ఆమె అన్నారు.
తాము ఎన్నికల్లో కష్టపడుతుంటే సీనియర్లు కాంగ్రెసు ఓడిపోతుందని ప్రకటనలు చేశారని ఆమె తప్పు పట్టారు. కాంగ్రెసులో ఉంటూ వేరే పార్టీకి మద్దతుగా మాట్లాడారని ఆమె విమర్శించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెసుకు 43 వేల ఓట్లు రావడం చిన్న విషయమేమీ కాదని ఆమె అన్నారు. గత ఎన్నికల్లో కన్నా ప్రస్తుతం తెరాస తరఫున పోటీ చేసిన జూపల్లి కృష్ణా రావుకు 375 ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయని ఆమె చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండకుండా వారిని మభ్య పెట్టి తెలంగాణవాదంతో గెలవాలనే స్వార్థ రాజకీయ ప్రయోజనాలను ఆశించినవారి వల్లనే ఉప ఎన్నికలు వచ్చాయని ఆమె అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంపై అపోహలు వద్దని ఆమె సలహా ఇచ్చారు.