బొత్స వర్గం దాడికి కిరణ్ కుమార్ వర్గం ఎదురుదాడి
డిఎల్ రవీంద్రా రెడ్డి, దామోదర రాజనర్సింహ, కె. కేశవరావు, తదిరులు కిరణ్ కుమార్ రెడ్డిని ఉప ఎన్నికల్లో ఓటమికి బాధ్యుడ్ని చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. దీంతో ముఖ్యమంత్రి ఉక్కిరి బిక్కిరి అయినట్లే కనిపించారు. అయితే గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి వర్గం ఎదురుదాడికి పూనుకుంటోంది. కిరణ్ కుమార్ రెడ్డికి అనుకూలంగా మంత్రి పితాని సత్యనారాయణ రంగంలోకి దిగారు. కడప ఉప ఎన్నికల్లో ఓడినప్పుడు డిఎల్ రవీంద్రా రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని ఆయన అడిగారు. మరో మంత్రి శైలజానాథ్ కూడా ముఖ్యమంత్రిపై విమర్శలను ఖండించారు. తాజాగా, మంత్రి డికె ఆరుణ తెలంగాణ సీనియర్లపై తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెసు సీనియర్ నాయకులపై ఆమె ఎదురుదాడి చేశారు.
సీనియర్ నేతల విమర్శలను తిప్పికొట్టేందుకు చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి, విప్ తూర్పు జయప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు రుద్రరాజు పద్మరాజు, రంగారెడ్డి రంగంలోకి దిగారు. తెలంగాణలో కాంగ్రెసుకు గతంలో కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీకి అండగా ఉండాల్సిన సమయంలో పార్టీని బలహీనపరిచేందుకు సీనియర్లు ప్రయత్నాలు చేస్తున్నారని వారు తప్పు పడుతున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసు పార్టీలో కుమ్ములాటలు మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
శాసనసభ సమావేశాలు ఈ నెల 29వ తేదీన ముగుస్తున్నాయి. ఈ సమావేశాల తర్వాత పార్టీ నాయకులు ఢిల్లీకి బారులు తీరే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలంగాణ నాయకులు కూడా ఢిల్లీ పెద్దలకు తమ వాదనను వినిపించేందుకు సిద్ధపడుతున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా తెలంగాణవాదాన్ని అందుకున్న బిజెపి మహబూబ్నగర్ సీటును గెలవడాన్ని వీరు ప్రమాదకరంగా చెబుతున్నారు. బిజెపి తెలంగాణవాదంతో మరింత బలపడే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తెరాస కూడా దెబ్బ తిని బిజెపి బలపడుతుందని, ఇది జాతీయ స్థాయిలో కాంగ్రెసు పార్టీకి ప్రమాదాన్ని తెచ్చి పెడుతుందని అంటున్నారు.