వైయస్ జగన్ కేసులో తదుపరి అరెస్టు ఎవరిది?
గడువులోగా చార్జిషీట్ దాఖలు చేసి, ఆ తర్వాత అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయడానికి కూడా సిబిఐకి అవకాశం ఉంది. అయితే, చార్జిషీట్ దాఖలు చేయడానికి ముందే ముఖ్యులను అరెస్టు చేయడం సిబిఐ ఆనవాయితీగా పెట్టుకుంది. ఎమ్మార్, గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసుల్లో ఇదే పని చేసింది. దీంతో వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఈ వారంలోగా సిబిఐ ఎవరిని అరెస్టు చేస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురిని సిబిఐ అధికారులు ఈ కేసులో ప్రశ్నించారు.
తాజాగా, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనా మంత్రిగా పనిచేసిన మోపిదేవిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. అలాగే, అప్పట్లో మౌలిక సదుపాయాల కల్పన ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఐఎఎస్ అధికారి మన్మోహన్ సింగ్ను మూడు రోజుల పాటు ప్రశ్నించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో జైలులో ఉన్న ఐఎఎస్ అధికారి రాజగోపాల్ను కూడా విచారించారు. మరో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిని కూడా వైయస్ జగన్ ఆస్తుల కేసులో విచారించే అవకాశం ఉంది. మొత్తం మీద, ఆ వారం రోజుల్లో ఎవరైనా అరెస్టవుతారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.