జగన్ది విచిత్ర మనస్తత్వం, ఆ ఖర్మ పట్టలేదు: బాబు
వ్యక్తిగతంగా తాను ఎవరికీ వ్యతిరేకం కాదని రాజకీయంగా మాత్రం తప్పు చేసిన వారిని నిలదీస్తానని అన్నారు. జగన్ అక్రమంగా సంపాదించారని అందుకే ప్రశ్నిస్తున్నామన్నారు. జివోల జారీలో మంత్రుల పాత్రపై సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయడాన్ని తాము సమర్థించామన్నారు. వైయస్ హయాంలో అక్రమంగా జగన్ సంపాదించారన్నారు. వైయస్ సోనియాకు సూటుకేసుల్లో డబ్బులు పంపించారన్నారు. జగన్ తప్పుల వల్లే అధికారులు జైళ్లలో ఉన్నారన్నారు. వైయస్ తన హయాంలో అవినీతికి పెద్ద పీట వేశారన్నారు. కొవూరులో జగన్ పార్టీ అభ్యర్థి భారీగా డబ్బులు పంచి గెలిచారన్నారు. ఇప్పుడు ఎవరు గెలిచినా చివరకు గెలిచేది ధర్మమే అన్నారు. 2జి స్పెక్ట్రంలో రూ.లక్షా డెబ్బయ్యారు వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలన అంటేనే అవినీతి పాలన అన్నారు.
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, చెన్నారెడ్డి, విజయ భాస్కర రెడ్డి, వైయస్ రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీ అందరికీ వ్యతిరేకంగా పోరాడుతున్నామన్నారు. జగన్కు పదవీ కాంక్ష అధికంగా ఉందన్నారు. వైయస్ ప్రజలకు భయపడే వ్యక్తి అని, జగన్ మాత్రం ఆ ప్రజలకు కూడా భయపడరన్నారు. ఆయన మనస్తత్వం విచిత్రమైనదన్నారు. డబ్బులు, దౌర్జన్యం ఆయన సొంతమన్నారు. నాపై అనేక ఆరోపణలు చేశారని, కోర్టుకెక్కారని కానీ దేనినీ నిరూపించలేక పోయారన్నారు. జగన్ టిఆర్ఎస్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. ఆయన న్యాయమూర్తులను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విమర్శించారు. అవినీతి సొమ్ముతో పత్రిక, టివి పెట్టి, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ పైనా పోరాటం చేస్తున్నామన్నారు.
బురదలో ఇరుక్కుపోయిన జగన్ మాపై బురద జల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. చిదంబరాన్ని కలవాల్సిన ఖర్మ నాకు లేదన్నారు. జగనే ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశారన్నారు. కాంగ్రెసుతో లాలూచీ పడ్డదెవరని ప్రశ్నించారు. తండ్రి చనిపోయి అక్కడ ఉండగానే ముఖ్యమంత్రి కావడం కోసం సంతకాలు పెట్టించారని విమర్శించారు. తాను సిఎంగా ఉన్నప్పుడు రౌడీలు భయపడే వారన్నారు. తాము జగన్ పైన పోరాడటం లేదని ఆయన క్రిమినల్ ఆటిట్యూడ్ పైన పోరాడుతున్నామన్నారు.