బాబు మాఫియా కింగ్, నాపైనా మాట్లాడేది: బొత్స

ప్రశాంతంగా ఉన్న విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత సృష్టించేందుకు, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. విజయనగరం జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరిగితే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో తప్ప తమ జిల్లాలో 144 సెక్షన్ లేదని ఆయన అన్నారు. తాను బాధ్యత గల మంత్రిగా ఉన్నానని, తప్పు చేసినట్లు రుజువైతే తల దించుకుంటానని, ఈ విషయం తాను ఇది వరకే చెప్పానని ఆయన అన్ారు.
చంద్రబాబు తనపై వచ్చిన ఆరోపణలపై కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నారని, తాను అలా చేయడం లేదని ఆయన అన్నారు. దయచేసి ఉద్రిక్తతలు సృష్టించవద్దని, వెనక్కి వెళ్లిపోవాలని ఆయన చంద్రబాబును కోరారు. ముప్పయి ఏళ్ల తమ కుటుంబ చరిత్ర చూస్తే తాము సంపాదించిందేమిటో తెలుస్తుందని ఆయన అన్నారు. చంద్రబాబులాగా రెండెకరాలతో రెండు వేల కోట్ల రూపాయలు సంపాదించలేదని ఆయన అన్నారు.
చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు, రోజుకో మాటా పూటకో మాట మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు వచ్చి తమకు చెప్తారా అని ఆయన అడిగారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు. రాజకీయాల్లో ఓ పద్ధతి ఉండాలని, నిర్దిష్టమైన ఆలోచన ఉండాలని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి విజయనగరం జిల్లాలో క్యాడర్ లేదని, విజయనగరం జిల్లాకు చెందినవారెవరూ చంద్రబాబుతో లేరని, విశాఖపట్నం జిల్లా నుంచి రప్పించారని ఆయన అన్నారు.
చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు నమ్మే స్థితి లేదని ఆయన అన్నారు. ఎన్టీఆర్ బొమ్మకు దండ వేస్తారట, ఎన్టీఆర్ చావుకు కారణం చంద్రబాబు కాదా అని ఆయన అడిగారు. చంద్రబాబు భాషను కూడా బొత్స తప్పు పట్టారు. ఇటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉండడం మన దురదృష్టమని ఆయన అన్నారు. ప్రజలు చంద్రబాబును అసహ్యించుకోవడానికి భాష కూడా కారణమని ఆయన అన్నారు. తన బంధువులకు, మిత్రులకు మద్యం దుకాణాలు ఉన్నాయని చెప్పానని, తానేమీ మాట మార్చలేదని ఆయన అన్నారు.
వ్యాపారాలు చేసుకోవడం తప్పు కాదని ఇప్పుడు అంటున్నారని ఆయన అన్నారు. అధికారులను తిట్టడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు అశోక్ గజపతి రాజు వద్ద తాను 70 ఎకరాల భూమి కొన్నానని, చంద్రబాబు వివాదం అదా అని ఆయన అన్నారు. ప్రతి అంశాన్ని చంద్రబాబు రాజకీయ కోణంతో చూస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications