నేనే ముఖ్యమంత్రిని ఐతే: వైయస్సార్సీ చీఫ్ జగన్

YS Jagan
ఏలూరు: తాను ముఖ్యమంత్రిని అయితే రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకుండా చేస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం అన్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేవుడు నన్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రానీయకుండా చూస్తానని అన్నారు.

రంగారెడ్డి జిల్లాకు చెందిన వరలక్ష్మి అనే బిటెక్ విద్యార్థిని తన తల్లిదండ్రులు ఫీజులు కట్టే పరిస్థితి లేక ఆత్మహత్యకు పాల్పడిందని, వారి కుటుంబాన్ని పరామర్శించినప్పుడే తనకు ఇలా అనిపించిందని చెప్పారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, ఏ ప్రాంతంలోని రైతులను అడిగినా వ్యవసాయం చేసుకోవడం కంటే ఉరి వేసుకోవడమే మంచిదన్నట్లుగా ఆవేదన చెందుతున్నారని ఆయన అన్నారు.

ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో మంత్రులు మందీ మార్బలంతోనూ, డబ్బు మూటలతోనూ దిగుతున్నారని, అనురాగానికి, ఆప్యాయతకు వెల కట్టేందుకు ప్రయత్నించబోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ విలువలకు కట్టుబడి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని, ఇలాంటి పరిస్థితుల్లో వీరిని గెలిపించి విలువలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రైతులను, మహిళలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న విద్యార్థులను ఎలా చదువుతున్నారని అడిగితే ఈ ప్రభుత్వం తమ ఫీజులు కడుతుండటంతో లేదో తెలియడం లేదని వాపోయారు. ఆరోగ్యశ్రీని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, అంబులెన్సులకు ఫోన్ చేస్తే డీజిల్ లేదని, షెడ్లలో ఉన్నాయని, సమ్మెలో ఉన్నామని సిబ్బంది చెబుతున్నారని, ప్రభుత్వం పేదవాడి ఆరోగ్యంతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత పేదలను పట్టించుకునే నేత రాష్ట్రంలో ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదన్నారు. ఆయన చనిపోయిన తర్వాత ప్రభుత్వం పేదలకు ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వైఖరికి నిరసనగా బాలరాజు పదవిని త్యాగం చేశాడని తెలిపారు.

ఉప ఎన్నికల్లో పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతారని తెలిసినా, మంత్రులు మోహరిస్తారని తెలిసినా, డబ్బు మూటలు తెచ్చిన అనురాగాలు, ఆత్మీయతలను వేలం వేసి కొంటారని తెలిసినా బాలరాజు పేదల తరఫున నిలబడ్డారన్నారు. ఈ ఉప ఎన్నికల్లో ఓట్ల ద్వారా పాలకులకు కనువిప్పు కలిగించాలని ఆయన ప్రజలను కోరారు. రానున్న ఉప ఎన్నికలల్లో బాలరాజుకు ఆశీస్సులు అందించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+