జగన్ పార్టీతో పోలిక వద్దన్న జానా, అసంతృప్తిలో గుత్తా

Jana Reddy - Gutta Sukhender Reddy
న్యూఢిల్లీ: పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి తనను తాను మావోతో పోల్చుకున్నారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. విమర్శలకు సమాధానం చెప్పేందుకు తాను హిందీలో శిక్షణ పొందుతున్నానని చెప్పారు. తాను హిందీ నేర్చుకోవటానికి, రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలోనే తనకు హిందీ వచ్చునని, అయితే అందులో ప్రావీణ్యం సంపాదించి, బాగా మాట్లాడేందుకు మాత్రమే శిక్షణ తీసుకుంటున్నానని వివరించారు.

అయినా మావోకు ఏం భాష వచ్చునని ఆ స్థాయికి ఎదిగారని అన్నారు. పుతిన్, రామరాజ్ నాడర్‌లకు కూడా మాతృభాషలు తప్ప మరే భాషలు రావని చెప్పారు. ప్రజా నాయకుడికి కావాల్సింది స్పందించే హృదయం తప్ప భాష కాదని చెప్పారు. ముఖ్యమంత్రి పదవి కోసమే తాను ఇంగ్లీష్, హిందీలు నేర్చుకోవడం లేదని చెప్పారు. తనకు ఆ పదవిపై ఎలాంటి ఆశా లేదన్నారు.

భాషా ప్రావీణ్యానికి పీఠానికి సంబంధం లేదన్నారు. హిందీ నేర్చుకుంటే ఎప్పుడైనా ఢిల్లీ వస్తే ఉపయోగపడుతుందని, ఎక్కడికెళ్లినా భాషలో ప్రవేశం ఉంటే బాగుంటుందని చెప్పారు. ఎదుగుదలకు భాషే అవసరం అనుకుంటే మావోకు చైనా తప్ప మరో భాష రాదన్నారు. ముఖ్యమంత్రి పదవి కంటే తాను ఉన్నతంగా ఉన్నానని చెప్పారు.

కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు, తమ పార్టీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ప్రదర్శనలు, ప్రగల్భాలతో కాలం వెళ్లబుచ్చే వాళ్లతో లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరిస్తే రాష్ట్రంలోని అన్ని సమస్యలను కూడా పరిష్కరించినట్లే అవుతుందని జానారెడ్డి చెప్పారు.

సీమాంధ్ర ప్రాంతంలో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తమ కాంగ్రెస్ కుటుంబానికి నష్టం జరగకూడదన్న ఉద్దేశంతోనే తెలంగాణ నాయకులమంతా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తిస్తున్నామని చెప్పారు. కాగా, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు వయలార్ రవితో జానారెడ్డి బుధవారం భేటీ అయ్యారు. వయలార్ నివాసానికి వెళ్లిన జానా ఆయనతో అరగంటకు పైగా చర్చించారు.

అనంతరం ఆయన తెలంగాణ ఎంపీలతో మాట్లాడారు. రాత్రికి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, జానా రెడ్డి కలిసి కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి ఇంటికి వెళ్లారు. దాదాపు అరగంటసేపు చర్చలు జరిపారు. వరుసగా నాలుగు రోజుల పాటు పార్లమెంటుకు సెలవు రావటంతో హైదరాబాద్ వెళ్లి, ప్రజల్ని కలవాలని ఎంపీలు నిర్ణయించారు.

కాగా, ఎంపీల సస్పెన్షన్‌లో తెరవెనుక అజెండాలు ఏవీ లేవని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకుంటే 2014లో ఎన్నికల నుంచి, రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నానని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని పార్టీలతో ఉండటం అనవసరమని అభిప్రాయపడ్డారు.

కాగా సస్పెన్షన్‌కు గురైనప్పటికీ బుధవారం ఎంపీలు తమ నిరసనను కొనసాగించారు. పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్దన నోటికి నల్లగుడ్డలు కట్టుకొని నిరసన తెలిపారు. ఎంపీలను భద్రతా సిబ్బంది పార్లమెంటు లోనికి వెళ్లనివ్వలేదు. అక్కడ ఎంపీల ఫోటోలు ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది.

కాగా తెలుగుదేశం పార్టీ నేత దేవేందర్ గౌడ్, కాంగ్రెసు నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డిలు బుధవారం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పాల్వాయి ప్రమాణం అనంతరం చివరలో జై తెలంగాణ అని నినాదం చేసి ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+