చంద్రబాబుకు ఎర్రబెల్లి దయాకర్ రావు దూరమేనా?
ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీకి దూరమవుతున్నారా, రాజకీయాలకు దూరమవుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మాత్రం దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయి నవ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి, ప్రజారాజ్య పార్టీలో చేరి తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన టి. దేవేందర్ గౌడ్కు రాజ్యసభ సీటు ఇవ్వడంపై ఎర్రబెల్లి దయాకర్ రావు అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి.
దేవేందర్ గౌడ్ను రాజ్యసభకు ఎంపిక చేసిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ పదవికి రాజీనామా చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఆ సమయంలో చంద్రబాబు సర్దిచెప్పడంతో రాజీనామాను ఆయన వెనక్కి తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, తాను రాజీనామానే చేయలేదని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. కానీ అప్పటి నుంచి ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉంటున్నారు.
తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్గా తొలుత పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశారు. అప్పట్లో ఎర్రబెల్లి దయాకర్ రావు నాగం జనార్దన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ పదవి ఎర్రబెల్లి దయాకర్ రావుకు వచ్చింది. ఫోరం కన్వీనర్గా ఆయన కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పట్లో మరో తెలంగాణ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులుతో ఎర్రబెల్లికి తగాదా వచ్చింది. దాన్ని చంద్రబాబు సరిచేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని అంటున్నారు.