ఏపీలో డ్వాక్రా సంఘాలపై విచారణ? కూటమి పార్టీ డిమాండ్..!
ఏపీలో సీఎం చంద్రబాబు మానసపుత్రికగా చెప్పుకునే డ్వాక్రా సంఘాలు (Dwacra Groups) దశాబ్దాలుగా విజయవంతంగా కొనసాగుతున్నాయి. మధ్యలో ప్రభుత్వాలు మారుతున్నా డ్వాక్రా సంఘాలకు మాత్రం ఎలాంటి ఇబ్బందులూ లేవు. అయితే తాజాగా ఏపీలో కూటమి సర్కార్ లో భాగమైన బీజేపీ (BJP) డ్వాక్రా సంఘాల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విచారణకు డిమాండ్ చేసింది. ఈ మేరకు డ్వాక్రా సంఘాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సమీక్ష నిర్వహించాలని ఏపీ బిజెపి చీఫ్ పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. మహిళా సాధికారతకు పారదర్శక సంస్కరణలు చేపట్టాలని ఆయన కోరారు.
రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు రుణాల పంపిణీ కేంద్రాలుగా మారుతున్నాయని పీవీఎన్ మాధవ్ ఆందోళన వ్యక్తం చేశారు. వీటిలో పొదుపు సంస్కృతిని పునరుద్ధరించి స్వయం ఉపాధికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆన కోరారు. మహిళలు అప్పుల చక్రంలో చిక్కుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రుణాల మంజూరులో బలవంతపు బీమాలు, అనధికార వసూళ్లపై విచారణ జరపాలన్నారు. ఆర్పీల ద్వారా పర్సంటేజ్ వసూళ్లను పూర్తిగా అరికట్టాలన్నారు.

ప్రతి డ్వాక్రా సంఘానికి డిజిటల్ అకౌంటింగ్, పారదర్శక డాష్బోర్డ్ ఏర్పాటు చేయాలని, డ్వాక్రా సంఘాలపై స్వతంత్ర సామాజిక ఆడిట్ నిర్వహించాలని మాధవ్ డిమాండ్ చేశారు. మహిళలకు డిజిటల్, ఫైనాన్షియల్ లిటరసీపై ప్రత్యేక శిక్షణలు ఇవ్వాలని,
SHG ఉత్పత్తులకు మార్కెట్ లింకేజీ, బ్రాండింగ్, ఈ-కామర్స్ సౌకర్యం కల్పించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
సంక్షేమం నుంచి స్వయం ఉపాధి, మహిళా పారిశ్రామికవేత్తల దిశగా డ్వాక్రా వ్యవస్థను మలచాలన్నారు. SERP, MEPMA పారదర్శక పర్యవేక్షణతో మహిళా సాధికారతకు పనిచేయాలని కోరారు. ఈ మేరకు జనతా వారధి ద్వారా మహిళలకు ప్రభుత్వ లక్ష్యాలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.














Click it and Unblock the Notifications