ఎన్సిటిసికి కిరణ్ మద్దతు, చిదంబరంపై జయ ఫైర్

ఎన్సిటిసిని వ్యతిరేకించడానికి కారణాలు ఏవీ కనిపించడం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదంపై పోరులో దేశవ్యాప్త సమన్వయానికి ఎన్సిటిసి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుందని, దేశ అంతరంగ భద్రతకు ఇది గ్యారంటీ ఇస్తుందని ఆయన అన్నారు.
కాగా, కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మండిపడ్డారు. తమకు ఎన్సిటిసి ప్రతిని పంపకపోవడం దారుణమని ఆమె కేంద్ర హోం మంత్రి చిదంబరంపై మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తమిళనాడుపై శీతకన్ను వేసిందని ఆమె విమర్శించారు. ఎన్సిటిసిని యుపిఎ భాగస్వామ్య పక్షానికి చెందిన తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా వ్యతిరేకిస్తున్నారు. దేశంలోని 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
ఎన్సిటిసి రాష్ట్రాలపై కేంద్రం పెత్తనానికి కాదని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఇది వివాదం కాదని ఆయన అన్నారు. కేంద్ర, రాష్టర్ ప్రభుత్వాలు కలిసి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మాత్రమే దీన్ని తెస్తున్నామని ఆయన చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాల్సి ఉందని, అందుకే ఎన్సిటిసిని సమర్థించాలని ఆయన అన్నారు.
దేశభద్రతకు ఎన్సిటిసి అవసరమని చిదంబరం చెప్పారు. ఉగ్రవాదులపై పోరుకు, ఉగ్రవాదంపై చర్యలకు ఇది వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కోగలమని ఆయన అన్నారు. ముంబై దాడుల తర్వాత ఎన్సిటిసి ఏర్పాటు చేయాలనే డిమాండ్ వచ్చిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications