కాంగ్రెసుకు గుడ్బై: వైయస్ వివేకా, జగన్పార్టీలోకి జంప్!
పులివెందుల కార్యకర్తలు, తన కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి బుధవారం అంతకు ముందు అన్నారు. ఆయన కడప జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్తును తన కార్యకర్తలే నిర్ణయిస్తారని చెప్పారు. ఆయన తన కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తనకు కాంగ్రెసులో ఉండాలనిపించడం లేదన్నారు. పార్టీ కోసం కుటుంబాన్ని వదిలేసినప్పటికీ తనకు కాంగ్రెసులో ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ను అందరూ దోషిగా చేసి మాట్లాడుతున్నారన్నారు. తన రాజకీయ భవిష్యత్తు నిర్ణయించమని కార్యకర్తలను కోరానని అన్నారు. వైయస్ ఉన్నన్నాళ్లూ కాంగ్రెసు అభివృద్ధికి పాల్పడ్డారన్నారు. ఆయన చనిపోయాక నిత్యం ఆయన పైనే విమర్శలు చేస్తున్నారన్నారు.
మంత్రులు విమర్శలు చేస్తుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏమాత్రం స్పందించడం లేదన్నారు. వైయస్ కుటుంబంపై కాంగ్రెసు కక్ష సాధిస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. అలాంటి పార్టీలో తాను ఎందుకు కొనసాగాలన్నారు.
కాగా ఇటీవల కాంగ్రెసు పార్టీలోని పలువురు నేతలు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించడం వివేకా జీర్ణించుకోలేక పోతున్నారని తెలుస్తోంది. వైయస్ను తిడితే తాను సహించేది లేదని ఆయన గతంలోనే పార్టీని హెచ్చరించారు. అయినప్పటికీ నేతలు వైయస్ పైన విమర్శలు చేస్తున్నారని, అందుకే ఆయన కాంగ్రెసును వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ రోజు రాజారెడ్డి వర్ధంతి కాబట్టి, ఇదే రోజు ఆయన జగన్ పార్టీలో చేరే అవకాశముందనే ప్రచారం కూడా జరుగుతోంది.
అంతకుముందు వైయస్ వివేకా తన తండ్రి దివంగత వైయస్ రాజారెడ్డి పద్నాలుగవ వర్ధంతిని పురస్కరించుకొని రక్తదానం చేశారు. పులివెదుల ప్రభుత్వం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన బుధవారం రాజారెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వివేకానంద రెడ్డితో పాటు రాజారెడ్డి అభిమానులు కూడా రక్త దానం చేశారు. అంతకుముందు పులివెందులలోని రాజారెడ్డి సమాధిని వివేకా, ఆయన కుటుంబ సభ్యులు సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.
కాగా పులివెందుల శాసనసభ్యురాలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వైయస్ రాజారెడ్డికి నివాళులు అర్పించారు. పులివెందులలోని రాజారెడ్డి సమాధి వద్ద అంజలి ఘటించి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.