వైయస్ జగన్ అరెస్టు తప్పదా?, అంతటా ఇదే మాట

ఈ నెల 28వ తేదీన తమ ముందు హాజరు కావాలని కోర్టు జగన్కు కోర్టు సమన్లు జారీ చేసిన తర్వాత తమ విచారణకు 25వ తేదీన హాజరు కావాలని సిబిఐ నోటీసు ఇచ్చింది. సిబిఐ విచారణను వాయిదా వేయించడానికి కోర్టుల ద్వారా జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉప ఎన్నికల తర్వాత హాజరవుతానని, అంతదాకా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ చేసిన విజ్ఞప్తులను కోర్టులు తిరస్కరించాయి. ఈ స్థితిలో ఆయన శుక్రవారం సిబిఐ ముందుకు తప్పనిసరిగా రావాల్సిన స్థితిలో పడ్డారు.
మంత్రి మోపిదేవి వెంకటరమణను అరెస్టు చేయడం ద్వారా వైయస్ జగన్ అరెస్టుకు రంగం సిద్ధం చేశారని అంటున్నారు. వ్యక్తిగత కక్షతో, కుట్రలతో జగన్ను అరెస్టు చేశారనే నిందలు రాకుండా తమ మంత్రి కూడా అరెస్టయ్యాడని చెప్పుకోవడానికే మోపిదేవి అరెస్టు జరిగిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు. అదే రకమైన అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
గుంటూరు జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారం సాగిస్తున్న వైయస్ జగన్ గురువారం రాత్రి హైదరాబాదుకు చేరుకునే అవకాశం ఉంది. రేపు పదిన్నర గంటలకు ఆయన సిబిఐ ముందుకు రావాల్సి ఉంది. సిబిఐ ముందుకు రావడానికే ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో హైదరాబాదు నగరంలో 144వ సెక్షన్ విధించారు. ఈ నెల 29వ తేదీ వరకు ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. వైయస్ జగన్ రేపు హాజరవుతారనే మాట అంతటా వినిపిస్తోంది.
అయితే ఈ సమయంలో జగన్ను అరెస్టు చేయలేరని కోర్టు వ్యాఖ్యానించింది. అరెస్టే చేయనప్పుడు ముందస్తు బెయిల్ అవసరం లేదని చెప్పింది. వైయస్ జగన్ తాత్కాలిక ముందస్తు బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చుతూ కోర్టు ఈ వ్యాఖ్య చేసింది.












Click it and Unblock the Notifications