పార్టీ ఆగ్రహం: రెండో రోజూ జగన్తో ఆళ్ల నాని, సబ్బం

వారిద్దరిపై చర్యలు తీసుకోవడానికి కాంగ్రెసు నాయకత్వం సిద్ధపడినట్లు తెలుస్తోంది. సబ్బం హరిపై ఎఐసిసికి ఫిర్యాదు చేయగా, ఆళ్ల నానికి నోటీసు జారీ చేసేందుకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) క్రమశిక్షణా సంఘం రంగం సిద్ధం చేస్తోంది. క్రమశిక్షణా సంఘం చైర్మన్ కంతేటి సత్యనారాయణ రాజు శనివారం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సమావేశమయ్యారు.
సబ్బం హరి, ఆళ్ల నానిలపై చర్యలు తీసుకునే విషయంపై చర్చించేందుకు బొత్స సత్యనారాయణ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. జగన్ను సిబిఐ అరెస్టు చేస్తుందనే ప్రచారం సాగుతున్న ప్రస్తుత స్థితిలో కూడా వైయస్సార్ కాంగ్రెసులోకి రావడానికి పలువురు కాంగ్రెసు నాయకులు సిద్ధపడుతున్నట్లు అర్థమవుతోంది.
వైయస్ జగన్ సిబిఐ విచారణ కోసం ఇంటి నుంచి బయలుదేరడానికి ముందు పలువురు నాయకులు ఆయనను కలిశారు. ఎస్వీ సుబ్బారెడ్డి తదితర నాయకులు ఆయనతో సమావేశమయ్యారు. జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి జగన్తో సమావేశమయ్యారు. తాను అరెస్టయితే పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలనే విషయంపై ఆయన ముఖ్య నాయకులతో చర్చించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications