నేడూ ఇంటి బోజనమే: జగన్ సిబిఐ విచారణ
వైయస్ జగన్ రెండో రోజు సిబిఐ విచారణతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు చెబుతున్నారు. మొదటి రోజు భయం పోగొట్టే పద్ధతిలో జరిగిన విచారణ శనివారం ఘాటుగా సాగుతున్నట్లు చెబుతున్నారు. జగన్ ఏదైనా ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేదని భావిస్తే లక్ష్మినారాయణ అందుకు సంబంధించిన పత్రాలను జగన్ ముందు పెడుతున్నట్లు తెలుస్తోంది. జగన్ ఇచ్చిన సమాచారం మేరకు సిబిఐ బృందాలు బ్యాంకు ఖాతాలను పరిశీలించేందుకు వెళ్లినట్లు సమాచారం.
పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ప్రభుత్వాధికారి బ్రహ్మానంద రెడ్డి, మోపిదేవి వెంకటరమణను ఇతర అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ను విడిగా లక్ష్మినారాయణ విచారిస్తున్నారని అంటున్నారు. వైయస్ జగన్ను శనివారం కూడా సిబిఐ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. రేపు కూడా వైయస్ జగన్ను విచారించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
వైయస్ జగన్ను సిబిఐ అధికారులు శుక్రవారం ఏడున్నర గంటలకు పైగా విచారించారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, అధికారి బ్రహ్మానంద రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణలతో కలిపి కూడా వైయస్ జగన్ను విచారించారు. విడిగా జగన్ను సిబిఐ అధికారులు చాలాసేపు విచారించారు. శనివారం కూడా కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి, శాసనసభ్యుడు ఆళ్ల నాని జగన్ వెంట వచ్చారు.