భర్త హంతకులకే క్షమాభిక్ష:విజయమ్మకు డిఎస్ కౌంటర్

తాను ఇప్పటి వరకు పది నియోజకవర్గాలలో పర్యటన చేశానని, అన్నింటిలో కాంగ్రెసుకు గెలుపు అవకాశాలున్నాయన్నారు. విజయంపై కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, నేతలు ధీమాగా ఉన్నారన్నారు. సోనియాపై ఆరోపణలు సరికాదన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు రాజీనామా అంశం తాను పత్రికలలోనే చూశానని అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడం ఆయనిష్టమన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుతో కాంగ్రెసు పార్టీకి ఎలాంటి నష్టం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. హెలికాప్టర్ ప్రమాదంపై విజయమ్మ విచారణ కోరుకోవడంలో తప్పులేదన్నారు. వ్యక్తిగతంగా జగన్తో పరిచయమున్న ఎమ్మెల్యేలే ఆ పార్టీలోకి వెళుతున్నారని చెప్పారు. విజయమ్మ ప్రచారానికి భారీగా జనం రావడానికి కారణం ఆమెను చూడాలనే ఆసక్తితోనే అన్నారు. ఆమె ప్రభావం కాస్త ఉండవచ్చునని అన్నారు.
జగన్ గెలిస్తే సువర్ణయుగం వస్తుందన్న విజయమ్మ వార్తలను తులసి రెడ్డి ఖండించారు. జగన్ వర్గం నేతలు అమ్ముడుపోయిన అంగడి సరుకు అన్నారు. పార్టీ విప్ ధిక్కరించి తెలుగుదేశం ప్రవేశ పెట్టిన అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసిన జగన్ వర్గం నేతలు త్యాగధనులు కాదని భోగధనులు అన్నారు. జగన్ పార్టీలోకి వెళితే మంటల్లో దూకినట్లేనని పాలడుగు వెంకట్రావు అన్నారు. వైయస్ విజయమ్మ, షర్మిళ నవ్వులతో ఓట్లు రాలవని, నవ్వులతో రాజకీయం నడవదని, ప్రజలు అంతా గమనిస్తున్నారని కొండ్రు మురళి అన్నారు.
జగన్ జైల్లో ఉన్నాడనే బాధ వైయస్ విజయమ్మకు లేదని మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. జగన్ తప్పు చేసినట్లు ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారని అన్నారు. కాంగ్రెసు పార్టీ నేతలు ఉప ఎన్నికలలో గెలుపు కోసం సమన్వయంతో పని చేస్తున్నట్లు చెప్పారు. పార్టీకి విధివిధానాలంటూ లేవు కాబట్టే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు సానుభూతిని ప్రచారాస్త్రంగా చేసుకొని జనంలోకి వెళ్తున్నారని శైలజానాథ్ మండిపడ్డారు.
అనంతపురం కాంగ్రెసు అభ్యర్థి ముర్షిదా భేగం తరఫున ప్రచారం నిర్వహించిన ఆయన వైయస్సార్ కాంగ్రెసు నేతల తీరుపై మండిపడ్డారు. ఆర్థిక నేరాలకు పాల్పడి జగన్ జైలుకెళ్లిన విషయం ప్రజలు గుర్తిస్తారన్నారు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన ఘనులు ఇప్పుడు కన్నీళ్లు కార్చి ఓట్లు దండుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. జగన్ వెంట చాలామంది జైలుకెళ్లిన వారెవరి గురించి మాట్లాడని విజయమ్మ కొడుక్కి అన్యాయం జరిగిందనడం విడ్డూరంగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications