గుట్టు విప్పని జగన్: అవసరమైతే నార్కోటిక్ పరీక్షలు?

ఐదు రోజుల కస్టడీలో భాగంగా జగన్ నుంచి వివరాలు రాబట్టడానికి సిబిఐ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను మొదటి రెండు రోజులు సిబిఐ ఒంటరిగా ప్రశ్నించింది. మూడోరోజు విజయ సాయి రెడ్డి సహా మరికొందరిని పిలిపించి వారితో కలిపి ప్రశ్నించింది. అయినా ఆశించిన స్థాయిలో జగన్ నుంచి సమాచారం రాలేదని తెలుస్తోంది. దీంతో తొలి మూడు రోజులు కొన్నిగంటలు మాత్రమే విచారించిన సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ నాలుగో రోజు స్వయంగా రంగంలోకి దిగారు. ఈ కేసులో ఇప్పటిదాకా సేకరించిన ఆధారాలను ఏ1 ముందుంచి ప్రశ్నించారు.
అయితే దైవం, జనం గురించి చెప్పడం లేదా మౌనమే సమాధానంగా వస్తుండటంతో జగన్ నుంచి సమాచారం రాబట్టాలంటే నార్కోటిక్ పరీక్షలు తప్పనిసరి అని సిబిఐ భావిస్తోందట. ఇప్పటికే న్యాయవాదులతో ఈ మేరకు చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి మరో మూడు రోజుల పాటు కస్టడీ పొడిగించాలని కోర్టును అడగాలని, అప్పటికీ ఫలితం లేకపోతే నార్కోటిక్ పరీక్షలకు అనుమతి కోరాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.
ఇదే కేసులో గతంలో ఏ2 విజయ సాయి రెడ్డిని నార్కోటిక్ పరీక్షలకు అనుమతించాలని సిబిఐ కోరగా కోర్టు తిరస్కరించింది. మరోవైపు బుధవారం ఉదయం పది గంటల్లోపే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, విజయ సాయి రెడ్డి వేర్వేరు వాహనాల్లో కోఠిలోని సిబిఐ కార్యాలయానికి వచ్చారు. చంచల్గూడ జైలులో వైద్య పరీక్షల తర్వాత జగన్ను బుల్లెట్ప్రూఫ్ వాహనంలో ఉదయం 10.35 గంటలకు సిబిఐ తమ కార్యాలయానికి తీసుకొచ్చింది.
మధ్యాహ్న భోజన విరామం వరకు ద్వారంపూడిని సాక్షి భవన నిర్మాణాల గురించి ప్రశ్నించినట్లు సమాచారం. ఆయన్ను మధ్యాహ్నం 1.30గంటలకు పంపించారు. ఇక జగతి పబ్లికేషన్స్లోకిపెట్టుబడులకు సంబంధించి సాయిరెడ్డి, జగన్ను సిబిఐ పలుమార్లు ప్రశ్నించినట్లు సమాచారం. కాగా, చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను బుధవారం ఆయన భార్య, కుటుంబసభ్యులు కలిశారు.












Click it and Unblock the Notifications