వైయస్ జగన్ పేరు చెప్పి సెటిల్మెంట్లు: మంగళి కృష్ణ
బెంగళూరులో 50 ఎకరాల ఆస్తి సెటిల్మెంట్ చేసి ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాసులు నాయుడు ద్వారా కోట్లు సంపాదించానని, బెంగళూరు శర్మ అనే వ్యక్తిని బెదిరించి ఈ ల్యాండ్ సెటిల్ చేశానని వివరించాడట. హంద్రి-నీవాలో ఆరుగురు కాంట్రాక్టర్లను బెదిరించామని, సూరి సోదరి హేమలతా రెడ్డి, భాను కిరణ్, మధు మోహన్ ఇందులో ఉన్నారని వెల్లడింటారని సమాచారం. ముషీరాబాద్ జైల్లో ఉన్న తన స్నేహితుడి ద్వారా సూరిని 2000లో కలిశానని, ఆ తర్వాత భానుమతికి రాజకీయంగా సాయం చేశానని చెప్పారని తెలుస్తోంది.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాకే సూరి కుటుంబం మరింత దగ్గరైందని, దీంతో తమ మధ్య బంధం మరింత పెరిగిందని అధికారులకు తెలిపాడట. వైయస్ తనకు పులివెందులలో పెట్రోలు బంకు ఇప్పించారని, తన భార్య శివ లక్ష్మి పేరుతోనే ఆ బంకు నడుస్తోందని వెల్లడించినట్లుగా తెలుస్తోంది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో యాంట్రిక్స్ కంపెనీ వారిపై మధుమోహన్ గన్ గురి పెట్టాడని, అప్పుడు తాను పక్కనే ఉన్నానని, సిఐ ఇండియా కంపెనీపై కేసు విత్డ్రా చేసుకోవాలంటూ వారిని బెదిరించామని వివరించాడని తెలుస్తోంది.
అజంతా థియేటర్ కూలగొట్టి పార్టనర్లను బెదిరించామని, టాటా కంపెనీతో వారు ఒప్పందం చేసుకున్నాక సమస్య సమసి పోయిందన్నారు. అయితే సిఐడి అధికారులు యజమానులను పిలిపించి తాజాగా ఫిర్యాదు తీసుకున్నారు. భానుతో పాటు సూరి సోదరి హేమలతా రెడ్డి, డ్రైవర్ మధుమోహన్ రెడ్డి, ఓ న్యాయవాదితో కలిసి 13 సెటిల్మెంట్లు చేశానని చెప్పాడని తెలుస్తోంది. కాగా సిఐడి గుర్తించిన వివరాలన్నీ 2005-09 మధ్యలోనివే అని తెలుస్తోంది.