తెలంగాణ కోసం జైలుకెళ్లినట్లు వారు...: జగన్‌పై కెటిఆర్

KT Rama Rao
హైదరాబాద్: వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వైయస్ విజయమ్మ, షర్మిల చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు కెటి రామారావు తిప్పకొట్టారు. తెలంగాణ కోసం రాజీనామా చేశానని కొండా సురేఖ చెప్పిన మాటలు అబద్ధాలని విజయమ్మ బట్టబయలు చేశారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమ కుటుంబం కోసం, వైయస్ జగన్ కోసం సురేఖ రాజీనామా చేశారని విజయమ్మ స్పష్టంగా చెప్పినట్లు ఆయన తెలిపారు.

కొండా సురేఖ వంద శాతం తమ కుటుంబం కోసమే రాజీనామా చేశారని విజయమ్మ, షర్మిల చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణను వైయస్ రాజశేఖర రెడ్డి అభివృద్ధి చేశారనే విజయమ్మ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఐదేళ్ల పాటు తెలంగాణ వనరులను విచ్చలవిడిగా దోచుకున్నారని, పొతిరెడ్డిపాడు ద్వారా ఓ నది మొత్తం జలాలనే కొల్లగొట్టడానికి ప్రయత్నించిన జల దొంగ వైయస్ రాజశేఖర రెడ్డి అని ఆయన విమర్శించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి రాగానే తెలంగాణపై తీర్మానం పెడతామని సురేఖ చేసిన ప్రకటనను ఆయన ఎద్దేవా చేశారు. వైయస్ రాజశేఖ రెడ్డి తొత్తులుగా కొండా దంపతులు వ్యవహరించారని ఆయన అన్నారు. ఎమ్మార్, పోలేపల్లి తదితర సెజ్‌ల ద్వారా వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ భూములను తనవారికి దోచిపెట్టారని ఆయన ఆరోపించారు. తెలంగాణ భూములను మంగలి కృష్ణ, పాండు, భాను కిరణ్ వంటి వారు వైయస్ హయాంలో కొల్లగొట్టారని ఆయన అన్నారు.

తెలంగాణ విషయంలో వైయస్ రాజశేఖర రెడ్డి సైంధవ పాత్ర పోషించారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ పేరు చెప్పినా, తెలంగాణవాదం గురించి చెప్పినా వైయస్ రాజశేఖర రెడ్డి వెటకారంగా మాట్లాడేవారని, అపహాస్యం చేసేవారని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చేప్పుడు వస్తుంది, ఈలోగా అభివృద్ధి చేద్దామని వైయస్ అనుకున్నారని వైయస్ విజయమ్మ చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వైయస్ తెలంగాణను అడ్డుకున్నారని ఆయన అన్నారు. తెలంగాణవాదం లేదని వైయస్ అన్నారని ఆయన గుర్తు చేశారు.

అవినీతి గురించి వైయస్సార్ కాంగ్రెసు నాయకులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి శవాన్ని ఇంట్లో పెట్టుకుని సంతకాల సేకరణ చేయడం శవ రాజకీయం కాదా అని ఆయన అడిగారు. తెలంగాణ కోసమో, దేనికోసమో వైయస్ జగన్ జైలుకు వెళ్లినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వలసవాదులకు, వలసవాద తొత్తులకు ఓటు పడితే తెలంగాణకు దూరమవుతామని ఆయన అన్నారు. వైయస్ జగన్, ఇతర సమైక్యవాదుల కుట్రను ఛేదించే విధంగా తెరాసకు ఓటేసి గెలిపించాలని ఆయన పరకాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+