బాబు ధర్నా: లగడపాటి వర్సెస్ టిడిపి, భేటీపై సవాళ్లు
కుమ్మరిపాలెంలో సెంటరులో బాబు మహాధర్నా చేస్తున్నారు. బాబు మహాధర్నాకు పోటీగా లగడపాటి కూడా ధర్నాకు సిద్ధమయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద లగడపాటి ధర్నాకు సిద్ధమయ్యారు. బాబు, లగడపాటి ధర్నాల కారణంగా విజయవాడలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద భారీగా బలగాలను మోహరించారు. చంద్రబాబును ఎలాగైనా కలుస్తానని లగడపాటి ప్రకటించడంతో పోలీసులు కాంగ్రెసు కార్యకర్తలను టిడిపి మహాధర్నా వైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పోలీసులు పలుచోట్ల ట్రాఫిక్ను మళ్లించారు. హైదరాబాదు నుండి వచ్చే వాహనాలను గొల్లపూడి వైపు మళ్లించగా హైదరాబాదు వైపు వెళ్లే వాహనాలను కృష్ణలంక, కరకట్ట, సొరంగమార్గం గుండా మళ్లిస్తున్నారు.
తమ పార్టీ అధినేత చంద్రబాబును లగడపాటిని కలవనిచ్చే ప్రసక్తే లేదని టిడిపి నేతలు చెబుతుండగా.. లగడపాటి మాత్రం తాను ఈ రోజు ఎట్టి పరిస్థితులలో బాబును కలుస్తానని చెప్పారు. తాను ఖచ్చితంగా బాబును కలిసి ఫ్లై ఓవర్ సాధ్యాసాధ్యాలపై వివరిస్తానని చెప్పారు. టిడిపి నేతలు అడ్డుకున్నా సూర్యుడు అస్తమించేలోపు.. చివరకు ఆయన వెళ్లే సమయంలో గన్నవరం విమానాశ్రయంలోనైనా ఖచ్చితంగా కలుస్తానని చెప్పారు. ప్లై ఓవర్ పైన బాబుకు అవగాహన కల్పించి మాట నిలబెట్టుకుంటానని చెప్పారు.