ప్రణబ్ను, సిఎం కిరణ్ను అడ్డుకున్న తెలంగాణవాదులు

ఉదయం పదిన్నరకు ప్రణబ్ హైదరాబాద్ చేరుకున్నారు. ప్రణబ్, ముఖ్యమంత్రి కిరణ్ కాన్వాయ్ విమానాశ్రయం నుండి బయటకు వస్తుండగా ఫ్లై ఓవర్ వద్ద పలువురు తెలంగాణవాదులు అడ్డుకున్నారు. తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. తెలంగాణపై వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రణబ్, కిరణ్ కాన్వాయ్ని అడ్డుకున్న తెలంగాణవాదులను నిరోధించే విషయంలో పోలీసు యంత్రాంగం విఫలమైందని అంటున్నారు. ప్రణబ్ వస్తున్నారని తెలిసి అక్కడ పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయలేదని అంటున్నారు.
ఒక్కసారిగా ఉల్కిక్కిపడ్డ కాన్వాయ్లోని టాస్క్ఫోర్స్ బృందం తెలంగాణవాదులను చెదరగొట్టింది. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో ఆందోళనకారులకు, పోలీసులకు కాసేపు వాగ్వాదం జరిగింది. కాగా ప్రణబ్ విమానాశ్రయం నుండి నేరుగా గాంధీ భవనం వెళ్లారు. జూబ్లీహాల్లో కాంగ్రెసు శాసనసభా పక్షం సమావేశాన్ని ఉద్దేశించి ప్రణబ్ ప్రసంగిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో తనకు ఓట్లేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాగా ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి ఎన్నికలలో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా పలు పార్టీలను కోరుతూ శనివారం నుండి ప్రచారం ప్రారంభించారు. ఇప్పటికే ఆయనకు తమిళనాడులో డిఎంకె మద్దతు కోరారు. యుపిఏ భాగస్వామ్య పక్షమైన డిఎంకే ఆయనకు మద్దతు ప్రకటించింది. మన రాష్ట్రంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి, మజ్లిస్ తదితర పార్టీల మద్దతు కోసం ఆయన హైదరాబాద్ వచ్చారు.












Click it and Unblock the Notifications