Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్ కేసు: తెరపైకి మరో జడ్జి పేరు

Gali Janardhan Reddy
హైదరాబాద్: ఓఎంసి కేసులో అరెస్టైన కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ ఫర్ సేల్ కేసులో తాజాగా కొత్త జడ్జి పేరు తెర పైకి వచ్చింది. గాలి బెయిల్ స్కాం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభాకర రావు అనే జడ్జి పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసు ఇప్పుడు మరో మలుపు తిరగడం విశేషం. గాలి జనార్దన రెడ్డికి బెయిల్ ఇప్పించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో జ్యుడీషియల్ ఆఫీసర్ (జిల్లా జడ్జి హోదా)గా పని చేస్తున్న ప్రభాకర్ రావు కూడా బేరం పెట్టినట్లు తేలింది. ఈ ముగ్గురూ ఒకప్పుడు కలిసి చదువుకున్న వారే కావడం విశేషం.

ఎసిబి అధికారులు అరెస్టు చేసిన పట్టాభిరామా రావు కుమారుడు రవిచంద్ర, రిటైర్డ్ జడ్జి చలపతిరావుల నేరాంగీకార పత్రంలో... బెయిల్ స్కామ్ గురించిన పూర్తి వివరాలు పూసగుచ్చినట్లున్నాయి. గాలికి బెయిల్ ఇచ్చిన పట్టాభి అంతకుముందు ఎసిబి కోర్టు జడ్జిగా ఉన్నప్పుడు లంచాల పోలీసుగా పేరొందిన రంగారెడ్డి జిల్లా ఓఎస్డీ సర్వేశ్వర రెడ్డికి కూడా బెయిల్ ఇచ్చారు. ఇందులోనూ మాజీ జడ్జి చలపతి రావు, రౌడీ షీటర్ యాదగిరి మధ్యవర్తులుగా వ్యవహరించారని, ఈ డీల్‌లో బెయిల్ ఇచ్చిన పట్టాభికి రూ.10 లక్షలు, ఇప్పించిన తనకు రూ.1లక్ష ముట్టాయని చలపతి రావు తన నేరాంగీకార పత్రంలోనే పేర్కొన్నారని తెలుస్తోంది.

రవిచంద్ర వాంగ్మూలం ప్రకారం... గాలికి బెయిల్ ఇప్పించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ జ్యుడీషియల్ ఆఫీసర్‌గా ఉన్న ప్రభాకర్ రావు పదే పదే ఫోన్‌ద్వారా కోరుతున్నట్లు మే 6వ తేదీన పట్టాభిరామా రావు తన కుమారుడు రవిచంద్రకు చెప్పారు. ఎర్రగడ్డలోని ఒక జ్యూస్ సెంటర్ వద్ద ప్రభాకర్‌ను పట్టాభి, రవిచంద్ర కలిశారు. తొలుత ప్రభాకర్, పట్టాభి 15 నిమిషాలపాటు కారులో ఏకాంతంగా మాట్లాడుకున్న తర్వాత రవిచంద్రతో ప్రభాకర్ మాట్లాడారు. గాలికి బెయిల్ ఇప్పిస్తే పది కోట్లు ఇస్తారని, జీవితానికి ఒక్కసారే వచ్చే అవకాశమిదని, వదులుకోవద్దని, మీ నాన్న దీనికి ఒప్పుకోవడం లేదని ప్రభాకర్ పేర్కొన్నారు.

ఆ తర్వాత కూడా మే 8, 9 తేదీల్లో ప్రభాకర్‌తోపాటు చలపతి కూడా వరుసగా ఫోన్లు చేశారు. వీరిద్దరిలో చలపతి ఆఫరే మంచిదని పట్టాభి ఓ నిర్ణయానికి వచ్చారు. ''బెయిల్ ఇస్తే రూ.5 కోట్లు వస్తాయని చలపతి రావు చెప్పారు. ప్రభాకర్‌ రావు రూ.10 కోట్లు ఇస్తామన్నప్పటికీ... చలపతి రావు డీల్‌లో మనం ఇతరులెవరినీ వ్యక్తిగతంగా కలవాల్సిన అవసరం లేదు. రిస్క్ తక్కువ. అందుకే రూ.5 కోట్లకే ఒప్పుకున్నాను. డబ్బులు వస్తాయి. వాటిని లాకర్లలో పెట్టి తాళంచెవులు మనకు ఇస్తారు'' అని తన కుమారుడికి వివరించారు.

11వ తేదీన గాలికి పట్టాభి బెయిల్ ఇచ్చారు. 12వ తేదీన చలపతిరావును రవిచంద్ర పంజాగుట్ట ప్రాంతంలో కలిశారు. మొత్తం డబ్బును కార్పొరేషన్ బ్యాంకు అశోక్‌నగర్ బ్రాంచి లాకర్లలో భద్రపరిచామంటూ... ఆ ఐదు లాకర్ల తాళం చెవులు చేతిలోపెట్టారు. ఆ సొమ్మును ఖైరతాబాద్‌లోని ఐఎన్‌జీ వైశ్య బ్యాంకులోకి మార్చాలని రవిచంద్ర భావించారు. లాకర్ ఇచ్చేందుకు కొంత డిపాజిట్ చేయాలని బ్యాంక్ మేనేజర్ చెప్పడంతో... డబ్బు తెచ్చేందుకు కార్పొరేషన్ బ్యాంకుకు వెళ్లాడు. అయితే, రవిచంద్ర పేరిట లాకర్‌లు ఏవీ లేవని మేనేజర్ చెప్పారు. దీంతో రవిచంద్ర కంగారు పడ్డారు.

తాము మోసపోయినట్లు రవిచంద్ర తన నాన్నకు ఫోన్ చేసి మరోవైపు... పట్టాభి తనతో డీల్ కుదుర్చుకోకుండానే గాలికి బెయిల్ ఇవ్వడంపై ప్రభాకర్‌కు అనుమానం వచ్చింది. పట్టాభికి, రవిచంద్రకు ఫోన్లు చేసి 'మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు?' అంటూ ప్రశ్నించారు. పట్టాబి ఒకసారి గుడివాడకు వెళ్లినా వదల్లేదు. మే 23వ తేదీన పట్టాభి హైదరాబాద్‌లో ఓ డెంటిస్టు వద్దకు వెళ్లినప్పుడు ప్రభాకర్ కలిశారు. "గాలికి బెయిల్ ఇప్పించేందుకు నిన్ను ఎవరు అప్రోచ్ అయ్యారో చెప్పు! మాకు రావాల్సింది రాలేదు. ఇంకా చాలా విషయాల్లో మమ్మల్ని ఇలాగే మోసం చేశారని మా మీడియేటర్స్ అంటున్నారు.' అని ప్రభాకర్ హెచ్చరించినట్లు పట్టాభి తన కుమారుడికి చెప్పారు.

కాగా పట్టాభి, చలపతిరావు ఎల్ఎల్‌బీలో సహాధ్యాయులు. ఇద్దరూ జడ్జిలు అయ్యారు. తరచూ ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక... చలపతిరావుకు రౌడీషీటర్ యాదగిరి రావుతో 2011 నవంబర్ నుంచి మంచి పరిచయముంది. ఎసిబి కేసులో అరెస్టయిన ఓఎస్డీ సర్వేశ్వర రెడ్డికి పట్టాభి ద్వారా బెయిల్ ఇప్పించాల్సిందిగా యాదగిరి రావు 2011డిసెంబర్‌లో చలపతిని కోరారు. ఈ డీల్ 'విజయవంతంగా' ముగిసింది. ఆ తర్వాత... ఈ ఏడాది మే తొలి వారంలో యాదగిరి గాలి కేసు గురించి చలపతి రావు దృష్టికి తీసుకెళ్లారు.

'గాలికి బెయిల్ ఇస్తే రూ.10 కోట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు' అని చెప్పారు. ప్రభాకర్ రావు కూడా ఈ విషయంలో తనతో 'టచ్'లోకి వచ్చారని చలపతిరావుకు పట్టాభి చెప్పారు. ఆ తర్వాత... అసలు ఎంత డబ్బులు వచ్చే అవకాశముందంటూ యాదగిరితో చలపతి రావు సంభాషణలు మొదలుపెట్టారు. మొదట రూ.3 కోట్లతో బేరం మొదలైంది. తర్వాత ఐదు కోట్ల వద్ద సెటిల్ అయ్యింది. మే 8వ తేదీన స్వయంగా సీబీఐ కోర్టుకు వెళ్లి పట్టాభి చాంబర్‌లోనే బెయిలు బేరంపై చర్చలు సాగించారు. "ప్రభాకర్ రూ.10 కోట్లు ఇప్పిస్తానన్నప్పటికీ, గాలి బంధువులతో స్వయంగా మాట్లాడాలన్నాడు. ఈ విషయంలో నీ సలహా చెప్పు' అని చలపతి రావును పట్టాభి అడిగారు.

ఎవరినీ కలవాల్సిన అవసరం లేకుండానే రూ.5 కోట్లు ఇప్పిస్తానని చలపతి రావు ఆఫర్ చేశారు. డబ్బు తక్కువైనప్పటికీ, రిస్క్ తక్కువ కావడంతో పట్టాభి సరే అన్నారు. చలపతిరావు కార్పొరేషన్ బ్యాంక్ మేనేజర్ నూరానాయక్‌కు ఫోన్ చేసి... పూర్వీకుల ఆస్తి అమ్మగా వచ్చిన డబ్బు దాచుకునేందుకు లాకర్లు కావాలని చెప్పి, వాటిని రెడీగా ఉంచారు. బెయిల్ ఇచ్చేందుకు డీల్ కుదిరినట్లుగా గాలి మనుషుల్లో నమ్మకం కలిగించేందుకు... పట్టాభి కుమారుడు రవిచంద్రను మాసాబ్ ట్యాంక్‌కు పిలిపిస్తానని, ఆయనతో మాట్లాడవచ్చని చలపతిరావు యాదగిరి రావుకు చెప్పారు.

అన్నట్లుగానే... మే 10వ తేదీ రాత్రి 8.30 గంటలకు రవిచంద్రను మాసాబ్‌ట్యాంక్‌కు పిలిపించారు. ఎవరితో మాట్లాడకుండా, అక్కడ ఎక్కువ సేపు ఉండకుండా వెంటనే తిరిగి వచ్చేయాలని పట్టాభి తన కుమారుడికి 'స్ట్రిక్టు'గా చెప్పడమే దీనికి కారణం. దీంతో... ఎవరినీ కలవక్కర్లేదని, మాసబ్‌ట్యాంక్‌లోని ప్యారడైజ్ హోటల్ టేక్అవేలో ఏదో ఒకటి పార్సిల్ తీసుకుని వెళ్లాలని చలపతిరావు చెప్పారు. రవిచంద్ర అలాగే చేశాడు. దీంతో గాలి మనుషుల్లో డీల్‌పై నమ్మకం కుదిరింది. 11వ తేదీన గాలికి బెయిల్ ఇచ్చే ముందు పట్టాభి మరోసారి చలపతిరావుకు ఫోన్ చేశారు. 'బెయిల్ ఇస్తున్నాను. రూ.5 కోట్లు ఇప్పించుకో' అని చెప్పాడు.

ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయని, డబ్బును లాకర్లలో పెట్టి, వాటి తాళం చెవులు అప్పగిస్తానని చలపతిరావు హామీ ఇచ్చారు. ఆ రోజు సాయంత్రం 4.30 గంటలకు గాలికి బెయిల్ వచ్చింది. రూ.3 కోట్లు అడ్వాన్సుగా పంపిస్తున్నట్లు యాదగిరి రావు ఫోన్‌లో చలపతి రావుకు చెప్పారు. రాత్రి 11.30 గంటలకు ఒక వ్యక్తి చలపతి రావు ఇంటికి వచ్చి ఒక అట్టపెట్టె ఇచ్చారు. అది తెరిచి ఉందేమిటని ప్రశ్నించగా... యాదగిరి కొంత డబ్బు తీసుకున్నాడని ఆ వ్యక్తి బదులిచ్చాడు. ఆ మరుసటిరోజు ఆ డబ్బులో దాదాపు సగాన్ని తన సహాయకుడు రవిశంకర్ ద్వారా కార్పొరేషన్ బ్యాంక్ (అశోక్‌నగర్ బ్రాంచ్)కు పంపించాడు.

తనూ బ్యాంకుకు వెళ్లాడు. మేనేజర్ మొదట రెండు లాకర్లు ఇచ్చినా అవి సరిపోలేదు. మరో మూడు లాకర్లు కావాలని మేనేజర్‌ను అడిగి తీసుకున్నారు. అందులోంచి రూ.4.50 లక్షలు తీసుకుని తన సేవింగ్ ఖాతాలో జమ చేశారు. ఐదు లాకర్ల కీస్‌ను గ్రాండ్ కాకతీయ హోటల్ వద్ద రవిచంద్రకు అప్పగించాడు. మిగిలిన రూ.2 కోట్లు చెల్లించాల్సిందిగా యాదగిరి రావును అడుగుతూనే ఉన్నాను. గాలి బెయిల్ రద్దు చేయాల్సిందిగా సిబిఐ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసిన తర్వాతే మిగిలింది ఇస్తామని యాదగిరి చెప్పాడు.

బ్యాంకు లాకర్లలో పెట్టగా మిగిలిన సొమ్మును చలపతిరావు మే 21వ తేదీన తన సోదరుడు బాలాజీ రావు ఇంటికి తరలించాడు. ఆ తర్వాత... మొత్తం గుట్టు రట్టయింది. లాకర్లలో డబ్బును సీబీఐ స్వాధీనం చేసుకుంది. డబ్బు ముందుగా ఇవ్వకపోవడం, దళారులను నమ్మకపోవడం, పట్టాభి కుటుంబ సభ్యులను స్వయంగా కలుస్తామనడం... ఇవన్నీ పరిశీలిస్తే ఈ విషయంలో గాలి సోదరులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారని స్పష్టమవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+