సిఎం డౌన్డౌన్: లష్కర్ బోనాలకు వచ్చిన సిఎంకు షాక్
అనంతరం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అయితే సిఎం కాన్వాయ్ని చూడగానే భక్తులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఉదయం నుండి వివిఐపిలకే అనుమతి ఇస్తే సాధారణ భక్తుల పరిస్థితి ఏమిటని మండిపడ్డారు. సిఎం రావడంతో భక్తులకు దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో భక్తులు సిఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
కిరణ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం కూడా వెనుదిరిగి వచ్చే సమయంలో మరోసారి సిఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కిరణ్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. గతంలో కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమ్మవారికి పట్టువస్తాలు సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కానీ ఈసారి కిరణ్ మాత్రం మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
హైదరాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ బండ కార్తిక రెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, పెద్దపల్లి ఎంపి వివేక్ కుటుంబ సభ్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీ నేత ఇంద్రసేనా రెడ్డి, సికింద్రాబాద్ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.