వైయస్ జగన్కు జైలులో ఈడీ నోటీసులు జారీ
శనివారంనాడే వైయస్ జగన్కు ఈడి అధికారులు జగన్కు నోటీసులు అందించినట్లు భావించారు. అయితే ఆ రోజు వారు నోటీసులు ఇవ్వలేదని తాజా సమాచారం ప్రకారం తెలుస్తోంది. సోమవారంనాడే ఈడి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈడి ఉన్నతాధికారి రాజేశ్వర సింగ్ నేతృత్వంలో జగన్ను ఈడి అధికారులు విచారిస్తారు. మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలపై ఈడి అధికారులు ఆయనను ప్రశ్నించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లను ఈడి అధికారులు ఇప్పటికే పొందారు. చార్జిషీట్లను సిబిఐ నుంచి తీసుకోవడానికి ఈడికి కోర్టు అనుమతి ఇచ్చింది. సిబిఐ చార్జిషీట్లలోని సమాచారం మేరకే కాకుండా తాము విడిగా సేకరించిన వివరాల ఆధారంగా ఈడి అధికారులు జగన్ను ప్రశ్నిస్తారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చంచల్గుడా జైలులోనే విచారించాలని కోర్టు ఈడిని ఆదేశించింది. దీంతో ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఈడి అధికారులు జైలు అధికారులకు సూచించారు.
మంగళవారం నుంచి ఈడి అధికారులు జగన్ను ప్రశ్నించే అవకాశం ఉంది. వైయస్ జగన్ కంపెనీల్లోకి విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడుల వివరాలపై రికార్డులను ముందు పెట్టి జగన్ను వారు విచారిస్తారు. అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్ చంచల్గుడా జైలులో ఉన్న విషయం తెలిసిందే.