రాష్ట్రపతి ఎన్నిక: వోటింగుకు కెసిఆర్ తెరాస దూరం

యుపిఎ రాష్ట్రపతి అభ్యర్థి తెలంగాణ వ్యతిరేక వైఖరిపై కూడా తెరాస నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. యుపిఎ ప్రభుత్వం ఆగస్టులో లేదా సెప్టెంబర్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తుందని, ఇందుకు సంబంధించిన తనకు స్పష్టమైన సంకేతాలు అందాయని కెసిఆర్ గత కొద్ది రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీకి అనుకూలంగా ఓటు వేసే ఉద్దేశంతోనే కెసిఆర్ ఇటువంటి ప్రకటన చేస్తున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి.
అదే సమయంలో తమకు అటువంటి సంకేతాలు ఏవీ లేవని, కెసిఆర్ ప్రకటనలో ఎంత నిజం ఉందనే విషయం తమకు తెలియదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ అన్నారు. ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమైన నిర్ణయం రాకపోతే తీవ్రమైన విమర్శలకు గురి కావాల్సి వస్తుందనే అభిప్రాయానికి కెసిఆర్ వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో ఓటింగుకు దూరంగా ఉండడమే మంచిదని కూడా ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకూడదనే అభిప్రాయం పార్టీలో బలంగా ఉందని, అయితే వచ్చే వారం సమావేశమై ఆ విషయంపై నిర్ణయం తీసుకుంటామని పార్టీ నాయకులు అంటున్నారు. తెరాసకు 17 మంది శాసనసభ్యులు, ఓ అనుబంధ శాసనసభ్యుడు ఉన్నారు. ఇద్దరు పార్లమెంటు సభ్యులు - కెసిఆర్, విజయశాంతి ఉన్నారు.












Click it and Unblock the Notifications