జగన్కు షాకిచ్చిన టిడిపి ఎమ్మెల్యే: కాంగ్రెస్లోకి చిన్నం
కొంతకాలంగా ఈ షరతులపై ఇరువైపుల చర్చోపచర్చలు జరిగాయట. చిన్నం డిమాండ్లకు వైయస్సార్ కాంగ్రెసు ససేమీరా అంటుండగా.. షరతులు అంగీకరిస్తేనే తాను వస్తానని ఆయన చెబుతున్నారట. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చిన్నం షరతులు లేకుండానే తమ వైపుకు ఖచ్చితంగా వస్తారని భావించిన వైయస్సార్ కాంగ్రెసు ఆయన డిమాండ్లకు అంగీకరించలేదట. దీంతో తప్పని పరిస్థితులలో ఆయన తాను కాంగ్రెసు నేత పాలడుగుతో కలిసి నడుస్తానని ఆదివారం సాయంత్రం ప్రకటించి ఆ పార్టీకి షాకిచ్చారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి పాలడుగు వెంకట్రావుతో కలిసి విలేకరుల సమావేశంలో ప్రత్యక్షమయ్యారు. అంతకుముందు పాలడుగుతో కలిసి రెండు కార్యక్రమాలలోనూ ఆయన పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో పాలడుగు పక్కన కూర్చోవడమే కాకుండా రాష్ట్రపతి ఎన్నికలలో యూపిఏ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రణబ్ ముఖర్జీకే తాను ఓటు వేస్తానని చిన్నం తేల్చి చెప్పారు. భవిష్యత్తులో పాలడుగుతోనే తన పయనమని స్పష్టంగా చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలలో ఎవరిని బలపరచాలో అనే దానిపై టిడిపి ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యే అయిన రామకోటయ్య తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పడం గమనార్హం.
ఎమ్మెల్సీ పాలడుగు ఆదివారం నూజివీడు పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు నూజివీడు వచ్చారు. పాలడుగుని కలిసిన చిన్నం రామకోటయ్య ఆయనతో కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. తర్వాత స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశానికి హాజరయ్యారు. ఇక్కడ పాలడుగు మాట్లాడుతూ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు పలుమార్లు తన మద్దతు తెలుపుతూ చిన్నం మాట్లాడారని, ఈ సందర్భంలోనే రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటేస్తానని తేల్చి చెప్పారన్నారు.
ప్రణబ్ ముఖర్జి తనకు లెటర్ రాయడం ఆనందపరిచిందని, అంతేకాక ఆయన ఆ పదవికి పూర్తి అర్హుడని భావించే తాను ఈ నిర్ణయానికి వచ్చానని చిన్నం తెలిపారు. ప్రణబ్ ముఖర్జి రాష్ట్రపతి అభ్యర్థిగా గెలిచిన తరువాత ఆయనతో కలిసి ఫొటో దిగే అవకాశం కల్పించాలని పాలడుగును చిన్నం రామకోటయ్య కోరారు. వెంటనే స్పందించిన పాలడుగు స్పందించి ప్రణబ్కు ఓటువేస్తానన్నందుకు కృతజ్ఞతలు అంటూ కరచాలనం చేశారు.