సోనియా మీటింగ్లో నో తెలంగాణ, జోవియల్గా..: సర్వే

తాము ఎవరం సమావేశంలో జై తెలంగాణ అనే నినాదాలు చేయలేదని సర్వే అన్నారు. మెజార్టీ ఎంపీలు సమావేశానికి వచ్చారని చెప్పారు. సోనియా జోవియల్గా ఉన్నారని, ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించారన్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో తాము ప్రతిపాదించిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారన్న గట్టి విశ్వాసం సోనియాలో కనిపించిందన్నారు. తమకు అవగాహన కల్పించేందుకే సమావేశం ఏర్పాటు చేశారన్నారు. జైతెలంగాణ నినాదాలు ఎవరూ చేయలేదని సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు.
ఎన్నికలకు అందరూ ఎంపీలు తప్పకుండా హాజరు కావాలని సోనియా సూచించారని విహెచ్ చెప్పారు. రాజకీయాల అంశం ప్రస్తావనకు రాలేదని, తెలంగాణ గురించి ఏమీ మాట్లాడలేదని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలకు, తెలంగాణకు సంబంధం లేదన్నారు. ఎంపీలమందరం కలిసే ఉన్నామని అనవసరంగా పంచాయతీ పెట్టవద్దని మీడియాను కోరారు. అందరూ హాజరయ్యారని, ఎవరూ తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేయలేదన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల అవగాహనకు పిలిచినందు వల్ల తెలంగాణ అంశం ప్రస్తావనకు రాలేదని పొన్నం ప్రభాకర్ అన్నారు. అయితే తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. జై తెలంగాణ జై సోనియా జై కాంగ్రెసు అని పొన్నం నినదించారు. కాగా సమావేశానికి సాయి ప్రతాప్, మాగుంట తదితర ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications