ముగ్గురు పిల్లలను హత్య చేసి, తల్లి ఆత్మహత్య
అండాలు కల్లు విక్రయించి కుమార్తె జంగమ్మ, ఆమె పిల్లలను సాకుతోంది. ఆరునెలల క్రితం సుధాకర్ కూడా ఇంద్రకల్ నుంచి ఆమనగల్లుకు చేరుకున్నాడు. పట్టణంలో ఓ జేసీబీపై డ్రైవర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జంగమ్మ అలియాస్ చందన, సుధాకర్గౌడ్లకు ముగ్గురు పిల్లలు నిక్షిత(5), అక్షిత(4), సోమశేఖర్ (9 నెలలు) ఉన్నారు. పట్టణంలోని శివాలయం నగర్లో ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి జంగమ్మ ఇంట్లో టీవీ ఎదుట కాళ్ళు జాపి భోజనం చేస్తుండగా కాళ్ళు ముడుచుకుంటే ఏమవుతుందని భర్త సుధాకర్ మందలించినట్లు సమాచారం. దీంతో భార్యభర్తల మధ్య మాటా మాట పెరిగి సుధాకర్ ఆమెపై చేయి చేసుకున్నట్లు తెలిసింది. ఉదయం ఐదు గంటలకు సుధాకర్ లేచి భార్యతో మాట్లాడకుండా డ్యూటీకి వెళ్ళాడు.
దీంతో జంగమ్మ కలత చెందింది. భోజనం లేకుండానే ఉదయం ఇద్దరు పిల్లలను పాఠశాలకు పంపించింది. మధ్యాహ్న సమయంలో తిరిగి ఇంటికి తీసుకుని వచ్చింది. స్కూల్ మధ్యలోనే పిల్లలను ఎందుకు తీసుకొచ్చావని చుట్టు పక్క వారు జంగమ్మను అడిగారు. మధ్యాహ్న భోజనం పంపించలేదని, అందుకే ఇంటికి తీసుకొచ్చానని ఆమె బదులిచ్చినట్లు సమాచారం. ఇంటి ప్రధాన ద్వారానికి తాళం యథావిధిగా ఉంచి వెనుక వైపు ఉన్న మరో ద్వారం నుంచి ఆమె ఇంట్లోకి ప్రవేశించింది. తలుపులు బిగించుకుని పదునైన ఆయుధంతో కుమార్తెలు నిక్షిత, అక్షితల గొంతు కోసి చంపేసింది. తొమ్మిది నెలల కుమారుడు సోమశేఖర్ గొంతు నులిమి హతమార్చింది. అనంతరం చీరతో సీలింగ్కు ఉన్న వంకెర (కొక్కెం)కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
సాయంత్రం జంగమ్మ ఇంటిపక్కనే ఉండే సమీప బంధువు ఒకరు, జంగమ్మ కన్పించడం లేదని ఆమె తల్లికి సమాచారం అందించారు. ఆమె అల్లుడు సుధాకర్తో కలిసి ఇంటికి చేరుకొంది. కిటికిలో నుంచి లోపలికి చూసే సరికి అప్పటికే చీరకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న జంగమ్మ కన్పించింది. దీంతో ఆందోళనకు గురైన చుట్టుపక్క వారితో కలిసి తాళాన్ని పగులగొట్టి ఇంట్లోకి వెళ్లారు. ఇంట్లో ముగ్గురు పిల్లల మృతదేహాలూ కన్పించాయి. సమాచారమందుకున్న సీఐ హరీష్కౌశిక్, ఎస్ఐ మనోజ్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని షాద్నగర్ డీఎస్పీ మాధవరెడ్డి పరిశీలించారు. మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.