ఓట్ ఫర్ బెయిల్!: జగన్పై టిడిపి, టిఆర్ఎస్ల మాట
పొట్ట చేత పట్టుకొని హైదరాబాదుకు వచ్చిన వారికి తాము వ్యతిరేకం కాదని.. తెలంగాణను అడ్డుకుంటున్న లగడపాటి రాజగోపాల్, కావురి సాంబశివ రావు వంటి వారిని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని ఎమ్మెల్యే హరీష్ రావు వేరుగా చెప్పారు. వక్ఫ్ ఆస్తులను దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అమ్మారని, జగన్ గెలిస్తే స్మశానాలను కూడా వదలడని ధ్వజమెత్తారు. టిడిపి, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసులు తెలంగాణకు అడ్డు పడుతున్నాయన్నారు.
ప్రణబ్కు ఓటేయాలన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయంపై టిడిపి కూడా మండిపడింది. జగన్ను కేసుల నుండి బయటపడేసేందుకు ప్రతిగా దాదాకు ఇప్పుడు ఓటేస్తున్నారని, ఆ తర్వాత జగన్ కాంగ్రెసులోకి తిరిగి వచ్చేసేందుకు కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసుల మధ్య ఒప్పందం కుదిరిందని టిడిపి నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కడప ఉప ఎన్నికలలో కడప పౌరుషం, ఆత్మగౌరవానికి మధ్య పోటీ అని అన్నారని, ఇప్పుడు ఆ ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టేశారా అని ప్రశ్నించారు.
కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు ఒక్కటేనని తాము మొదటి నుండి చెబుతున్నామని, ఇప్పుడు ప్రణబ్ కు ఓటు ద్వారా తమ వాదన సత్యమని తేలిందని మరో నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. జగన్ పైన కేసుల్లో కాంగ్రెసు ప్రమేయం లేదని మేకపాటి రాజమోహన్ రెడ్డి అంటున్నారని చెప్పారు. వారిదంతా నాటకమన్నారు. వైయస్ జగన్ నీకిది నాకది వ్యవహారం రాజకీయాలకూ విస్తరించిందని కెటి రామారావు మండిపడ్డారు. జగన్ పైన సిబిఐ విచారణను ఢిల్లీ కుట్రగా అభివర్ణించిన వైయస్ విజయమ్మ ఇప్పుడు అదే ఢిల్లీకి వెళ్లి ప్రణబ్కు ఓటు.. జగన్కు బెయిల్ ప్యాకేజీ మాట్లాడుకొని వచ్చారని ధ్వజమెత్తారు.