విహెచ్ దీక్ష షురూ: ఆజాద్కు ఎమ్మెల్యేల ఫిర్యాదు
పార్టీ కోసం పనిచేస్తే తాము విహెచ్ను అభినందించి ఉండేవాళ్లమని శానససభ్యుడు జోగి రమేష్ అన్నారు. ఏమైనా ఉంటే పార్టీ నాయకులతో మాట్లాడాలని ఆయన సూచించారు. విహెచ్ దీక్ష వెనక రహస్య ఎజెండా ఉందని ఈ ఇరువురు శాసనసభ్యులు ఆజాద్కు రాసిన లేఖలో ఆరోపించారు. విహెచ్ దీక్ష వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని వారన్నారు. విహెచ్పై చర్యలు తీసుకోకపోతే పార్టీలో క్రమశిక్షణ దెబ్బ తింటుందని వారన్నారు.
బాధ్యత గల నాయకుడిగా విహెచ్ చర్య మంచిది కాదని, కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారన్నారు. సూచనలు, సలహాలు ఇవ్వదలుచుకుంటే తగిన వేదికలున్నాయని మల్లాది విష్ణు అన్నారు. విహెచ్ను కట్టడి చేయాలని ఆయన ఆజాద్ను కోరారు. విహెచ్ చర్య వల్ల పార్టీపై కార్యకర్తల్లో చులకన భావం ఏర్పడుతుందని, కార్యకర్తల పేరుతో అలా చేయడం వల్ల కార్యకర్తల్లో విహెచ్పై ఏహ్యభావం కలుగుతుందని ఆయన అన్నారు. తిరుపతిలో ఉప ఎన్నికల సమయంలో విహెచ్ దీక్షకు దిగడం వల్ల పార్టీకి నష్టం జరిగిందని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి పేరును పదే పదే వల్లె వేయడం వల్ల, చెప్పిన విషయాలనే మళ్లీ మళ్లీ చెప్పడం వల్ల తిరుపతిలో కాంగ్రెసు పార్టీకి ప్రతికూల వాతావరణం ఏర్పడిందని వారన్నారు. వ్యక్తిగతమైన ఎజెండాలను ముందుకు తీసుకుని పోతే పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోవర్టుగా చిత్రీకరించే ప్రయత్నం సరి కాదని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ జగన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కాగా, విహెచ్ దీక్షకు కాంగ్రెసు అధిష్టానం దిగి వచ్చినట్లు తెలుస్తోంది. కార్యకర్తలతో మేధోమథన సదస్సును ఏర్పాటు చేయడానికి అధిష్టానం అంగీకరించినట్లు సమాచారం. ఉప రాష్ట్రపతి ఎన్నికల తర్వాత మేధోమథన సదస్సును ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ విషయంపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటన చేస్తారని చెబుతున్నారు.