సోనియాతో విజయమ్మ: ఆత్మ రక్షణలో జగన్ పార్టీ
తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని ఢిల్లీ వెళ్లినప్పుడు కలవలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి శనివారం అన్నారు. తమ పార్టీలోకి వలసలను నివారించేందుకు కాంగ్రెసు ఇలాంటి ప్రచారానికి తెర తీసిందని విమర్శించారు.
సోనియా, విజయమ్మల సమావేశం జరిగిందని టిడిపి నేతలు కూడా అంటున్నారని, వారి పార్టీ నుండి కూడా వలసలు ఆపించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. తమ పార్టీకి ఎవరితోనూ కలవాల్సిన అవసరం లేదన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెసు రాష్ట్రంలో మూడో స్థానానికి పరిమితం కాక తప్పదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు స్వీయ రక్షణలో పడ్డాయని అన్నారు.
రైతాంగ సమస్యలపై ప్రధానితో పాటు పలువురు కేంద్ర నేతలను కొద్ది రోజుల క్రితం విజయమ్మ కలిశారని, ఆ బృందంలో తాను కూడా ఉన్నానని వివరణ ఇచ్చారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కేసుల విషయంలో సిబిఐ అనుసరిస్తున్న వైఖరిని వివరించడానికి సివిసిని కూడా కలిసామన్నారు. తమ పార్టీల్లోంచి వలసలు ఆపేందుకే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.