మనమూ వెళ్లాల్సిందే: జగన్ వ్యూహం, విజయమ్మతో..
ఇటీవల ఉప ఎన్నికలలో ఓటమికి కారణాలు చెబుతూ కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్... మూడేళ్లుగా తమ పార్టీ నేతలు ప్రజల్లో ఉండలేదని, కానీ జగన్ మాత్రం ఓదార్పు, దీక్షల పేరుతో వారి మధ్యనే ఉన్నారని, అందుకే తమ పార్టీ ఆశించిన స్థాయిలో సీట్లను గెలుచుకోలేదని చెప్పారు. ఇక నుండి తమ పార్టీ నేతలు కూడా ప్రజల్లోకి వెళతారని చెప్పారు. అంటే జగన్ ఓదార్పును చూసినా, ఆజాద్ వ్యాక్యలను గమనించినా పార్టీ ప్రజల్లో ఉండటం ఎంత ముఖ్యమో అర్థమవుతోంది.
ఆయితే జగన్ అరెస్టు తర్వాత అంతా తారుమారైందని చెప్పవచ్చు. జగన్ పార్టీ ప్రజల్లోకి వెళ్లడం తగ్గితే అదే సమయంలో కాంగ్రెసు, టిడిపిలు మాత్రం జోరుగా పర్యటనలు చేస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిర బాట పేరుతో జిల్లాలను చుట్టి వస్తున్నారు. ఇప్పటికే రెండు జిల్లాలలో పర్యటించిన సిఎం త్వరలో మరో జిల్లాలో ఇందిర బాట నిర్వహించనున్నారు. దీంతో కాంగ్రసులో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలో జోరుగా పర్యటిస్తున్నారు. మరోవైపు బిసిలకు వంద సీట్ల పేరుతో ఆ పార్టీలో నూతనోత్తేజం తొణికిసలాడుతోంది. కిరణ్, చంద్రబాబులు పర్యటనలతో బిజీగా గడుపుతుండగా జగన్ అరెస్టు తర్వాత జగన్ పార్టీ మాత్రం ప్రజల్లోకి వెళ్లింది తక్కువే. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ రెండు మూడు ధర్నాలు మాత్రమే చేపట్టింది.
తెలంగాణవాదం కారణంగా సిరిసిల్ల దీక్ష రాద్ధాంతానికి దారి తీసింది. మిగిలిన దీక్షలు అంతగా ప్రభావం చూపలేదని చెప్పవచ్చు. అయితే జగన్ కూడా కిరణ్, బాబులకు ధీటుగా ఇక నుండి పార్టీని ప్రజల్లో ఉంచే విధంగా జైలు నుండే వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల 12, 13వ తేదీలలో ఏలూరులో దీక్ష చేపట్టనున్నారు. ఆ తర్వాత సాధ్యమైన త్వరలోనే తెలంగాణ ప్రాంతంలో మరో ఆందోళన విజయమ్మ చేపట్టనున్నారట. తాను జైలు నుండి బయటకు వచ్చినా రాకున్నా 2014 వరకు కాంగ్రెసు, టిడిపిల కంటే తమ పార్టీయే ప్రజల్లో ఎక్కువగా ఉండే విధంగా జగన్ వ్యూహరచన చేస్తున్నారట.