రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ కోత, ఈ రోజు నుంచే అమలు

పట్టణాలకు ఆరు గంటల పాటు విద్యుత్ కోత విధిస్తున్నారు. గ్రామాల్లో 12 గంటలు విద్యుత్తు కోతను విధిస్తుంటే, మండల కేంద్రాల్లో ఆరు గంటల పాటు విద్యుత్ కోత పెడుతున్నారు. జిల్లా కేంద్రాలు, కార్పోరేషన్లలో విద్యుత్ కోత ఐదు గంటలు ఉంటుంది. హైదరాబాద్, తిరుపతి, వరంగల్, విశాఖపట్నాల్లో మూడు గంటల విద్యుత్ కోత ఉంటుంది. అత్యవసర సర్వీసులను విద్యుత్ కోత నుంచి మినహాయించారు.
రాష్ట్రంలో విద్యుత్ కోతపై ఇప్పటికే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్తును సరఫరా చేయడం లేదని విమర్శిస్తున్నాయి. రైతులకు ఏడు గంటల పాటు విద్యుత్తును అందించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు మంగళవారం విద్యుత్ సౌధా ముందు ధర్నాకు దిగారు. దీంతో వారిని అరెస్టు చేసి పోలీసులు బొల్లారం పోలీసు స్టేషన్కు తరలించారు. అక్కడ కూడా వారు ధర్నాను కొనసాగిస్తున్నారు. అక్కడే వంటావార్పూ పెట్టారు.
తెలుగుదేశం, తదితర ప్రతిపక్ష పార్టీలు కూడా విద్యుత్ కోతకు నిరసనగా ఆందోళనలకు శ్రీకారం చుడుతున్నాయి. ఉత్పత్తికి, డిమాండ్కు మధ్య అంతరం ఎక్కువగా ఉండడంతో విద్యుత్తును అందించలేని స్థితిలో ప్రభుత్వం పడింది. జల విద్యుదుత్పాదనకు కూడా అనువుగా జలాశయాలు నీటితో నిండ లేదు. గ్యాస్ ఆధారిత విద్యుత్కేంద్రాలకు గ్యాస్ సరిపోయేంత అందడం లేదు. దీంతో విద్యుదుత్పాదనపై తీవ్రమైన దెబ్బ పడింది.












Click it and Unblock the Notifications