హరీష్ అక్కడ ఎర్రబెల్లి ఇక్కడ: తలసాని, కెటిఆర్ అరెస్ట్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్యుత్ కొరత వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేపట్టిన తమను అరెస్టు చేయడమేమిటని వారు పోలీసులపై మండిపడ్డారు. ప్రజల కష్టాలను చూడకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. విద్యుత్ కోతలపై టిడిపికి వామపక్షాలు కూడా జతకలిశాయి. గోషామహల్ స్టేడియంలో టిడిపి మహిళా నేతలు... తమ పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
ఇదే విషయమై సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు సచివాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని కెటిఆర్ సహా పలువురిని అరెస్టు చేశారు. విద్యుత్ సౌధ వద్ద, సచివాలయం వద్ద పార్టీల ఆందోళన కారణంగా ఆ ప్రాంతాలలో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
మరోవైపు మంగళవారం అరెస్టైన తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు బొల్లారం పోలీసు స్టేషన్లో తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. దీక్ష కోసం తెరాస నేతలు పోలీసు స్టేషన్ ఎదుట టెంట్ వేశారు. దీనిని పోలీసులు తొలగించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత తెరాస కార్యకర్తలు మరోమారు టెంట్ వేసుకున్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు, రాజయ్యలు మాట్లాడుతూ... ఎస్సైని దుర్భాషాలాడిన మంత్రి దానం నాగేందర్ పైన ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని, కానీ ప్రజల కోసం పోరాడుతున్న తమను అరెస్టు చేయడమేమిటని ప్రశ్నించారు. తమది న్యాయపోరాటమన్నారు. ఈ విషయాన్ని తాము అసెంబ్లీలో ప్రస్తావిస్తామని, హైకోర్టుకు కూడా వెళ్తామని చెప్పారు. ప్రభుత్వం ప్రజలను బ్లాక్ చేయడం మానేసి సమస్యలు పరిష్కరించాలని హితవు పలికారు. రైతులకు ఏడు గంటల విద్యుత్ ఇచ్చే వరకు ఉద్యమిస్తామన్నారు.