స్టూడెంట్స్ విషయంలో కేంద్రీయ విద్యాలయ తాజా సర్కులర్: గైడ్ లైన్స్, డెడ్ లైన్: ఇకపై
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ తాజా సర్క్యులర్ ఒకటి జారీ చేసింది. కోట్లాదిమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు డెడ్ లైన్ ఇచ్చింది. లాంగ్వేజ్ ఎంపిక విషయంలో పేరెంట్స్ తమ నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ తాజా సర్కులర్ వెలువడింది. ప్రత్యేకించి 6 నుంచి 9వ తరగతి వరకు చదువుకునే విద్యార్థుల విషయంలో తాజా గైడ్ లైన్స్ అమలు కానున్నాయి.
మూడో భాషపై నూతన మార్గదర్శకాలు వెలువడ్డాయి. ఈ సర్కులర్ ప్రకారం దేశంలోని ప్రతి కేంద్రీయ విద్యాలయంలో 6 నుంచి 9 తరగతుల్లో మూడో భాషగా సంస్కృతం చదివే విద్యార్థుల కోసం కనీసం ఒక ప్రత్యేక విభాగం తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,334 కేంద్రీయ విద్యాలయాలు పనిచేస్తున్నాయి. వీటికి అదనంగా మాస్కో, ఖాట్మాండు, టెహ్రాన్ లల్లో ఒక్కో కేవీ స్కూల్స్ అందుబాటులో ఉంటోన్నాయి.

తరచూ బదిలీ అయ్యే విద్యార్థులు.. అంటే రక్షణ, సెంట్రల్, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో సంస్కృతాన్ని ఓ జనరల్ ఆప్షన్ గా అమలు చేయనున్నట్లు సంఘటన్ తెలిపింది. అదే సమయంలో బదిలీలు కాని విద్యార్థులు అంటే.. రాష్ట్రస్థాయిలో పని చేసే ఉద్యోగుల పిల్లల కోసం ప్రాంతీయ భాషలను ప్రత్యామ్నాయంగా ఇచ్చినట్లు వివరించింది.
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఇప్పటికే మూడుభాషల విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో సంస్కృతం మూడో భాష. విద్యార్థులకు సంస్కృతం లేదా ప్రాంతీయ భాషలో ఏదో ఒకదాన్ని మూడో భాషగా చదివే అవకాశం లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 2026-27 విద్యా సంవత్సరంలో 6 నుంచి 9 తరగతుల్లో ఆర్3 అమలును తప్పనిసరి చేయడానికి ఏప్రిల్ 10, మే 27, 29 తేదీల్లో వరుసగా ఉత్తర్వులు ఇచ్చింది సంఘటన్.
తాజా సర్కులర్ కూడా ఇందులో భాగమే. దీనికి సంబంధించి తల్లిదండ్రులు జులై 5వ తేదీ నాటికి ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సమగ్ర డేటాను ప్రిన్సిపల్స్ వెంటనే పూర్తిచేయాలని ఆదేశించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఆర్3 భాషా ప్రాధాన్యాలను సేకరించాలని కూడా ఈ సర్కులర్ స్పష్టం చేసింది.
సర్క్యులర్ ప్రకారం సంస్కృతం లేదా ప్రాంతీయ భాష ఆర్ 3గా ఆప్ట్ చేయాలి. ఇప్పటికే ఆర్ 1 గా హిందీ, ఆర్ 2 గా ఇంగ్లీష్ కు ఇది పూర్తిగా భిన్నంగా ఉండాలి. కొన్ని కేవీల్లో ఉపాధ్యాయుల కొరత, వనరుల పరిమితులు ఉన్నప్పటికీ, కాంట్రాక్టు ఉపాధ్యాయులను వినియోగించుకుని అయినా సరే సంస్కృతాన్ని ఆర్ 3గా దశల వారీగా అమలు చేస్తామని తెలిపింది. అలాగే ఎన్సీఈఆర్టీ పాఠ్యసామగ్రి అందుబాటులో లేని చోట ఎస్సీఈఆర్టీ పుస్తకాలను ఉపయోగించడం ద్వారా ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొంది.
మూడో భాష తప్పనిసరి కావడంతో ముఖ్యంగా 9వ తరగతిలో కొన్ని సబ్జెక్టుల పీరియడ్ కేటాయింపులు మారుతాయి. అందుకే ప్రతి పాఠశాల స్థాయిలో బోధనా సిబ్బంది సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది సంఘటన్. కేవీల్లో వివిధ కేడర్ల సిబ్బంది లెక్కింపు ప్రస్తుతం సమాగం పోర్టల్ ద్వారా డిజిటల్ పద్ధతిన జరుగుతోంది. ఒక సెక్షన్లో 15 మందిలోపు ఉంటే కొందరు సంస్కృతం, కొందరు ప్రాంతీయ భాషలను ఎంచుకున్నా కలిసి చదవించవచ్చు.
విద్యార్థుల ఆప్షన్ ఆధారంగా ఒక సంస్కృతం, ఒక ప్రాంతీయ భాష సెక్షన్ లేదా ఒక సంస్కృతం, రెండు ప్రాంతీయ భాషల సెక్షన్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదీ తాజా సర్కులర్ ద్వారా. ప్రతి తరగతిలో కనీసం ఒక సంస్కృత సెక్షన్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications