సిఎం మార్పు?: ఏంచేద్దాం.. చిరు నుండి సోనియా ఆరా
ఈ భేటీ రాజకీయమా లేక మర్యాదపూర్వకమా అనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చిరంజీవి నుండి సోనియా ఆరా తీశారని సమాచారం. ముఖ్యమంత్రి మార్పు అంశంపై ఢిల్లీ పెద్దలు, రాష్ట్ర నేతలు ఎంతగా కొట్టి పారేసినప్పటికీ ఆ ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది. అదే సమయంలో అధిష్టానం ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చిరంజీవి బుధవారం వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెసు వర్గాల్లో, రాష్ట్రంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
కేంద్రమంత్రి పదవిని చిరంజీవికి ఇవ్వాలని భావిస్తున్నప్పటికీ ఇప్పట్లో విస్తరణ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో చిరంజీవికి రాష్ట్రంలో ఏవైనా బాధ్యతలు అప్పగించనున్నారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కేంద్రమంత్రి పదవిపై చిరుకు హామీ లభించి ఉండవచ్చునని కూడా చెబుతున్నారు. ఇప్పటికే మంత్రి ధర్మాన వ్యవహారం ఢిల్లీకి చేరుకుంది. ఈ విషయంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వచ్చారు. కిరణ్ను కూడా హఠాత్తుగా పిలిపించడం వెనుక.. కళంకిత మంత్రులను పక్కకు పెట్టేందుకా లేక ముఖ్యమంత్రిని మార్చేందుకా అనేది హాట్ టాపిక్గా మారింది.
కేవలం ధర్మాన వ్యవహారంతోనే సరిపెట్టకుండా ఇంకా ఢిల్లీలో ఏదో జరుగుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దాదాపు రాష్ట్రంలోని కాంగ్రెసు నేతలు అందరూ ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నారు. శంకర రావు వంటి నేతలు ఢిల్లీ పెద్దలను కలిసి కిరణ్ కుమార్, బొత్స సత్యనారాయణలపై ఫిర్యాదులు చేశారు. అయితే సిఎం మార్పు అయినా, ధర్మాన వ్యవహారం అయినా ఏదైనా సాయంత్రం లోగా అధిష్టానం మనసులోని మాట బయటకు వచ్చే అవకాశముంది.